గుడ్న్యూస్: ఇకపై పీఓఎస్ యంత్రాల నుంచి నగదు తీసుకోవచ్చు!
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒక శుభవార్త చెప్పింది. ఇకపై అన్ని బ్యాంకుల పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషిన్ల నుంచి నగదు విత్ డ్రా చేసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అన్ని బ్యాంకులు, కో- ఓపెరేటివ్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, అధీకృత పేమెంట్ నెట్వర్క్ కంపెనీలకు వర్తిస్తుంది. ఇవన్నీ ఇకపై వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని కల్పించవచ్చు. ఈ నిర్ణయం జనవరి 31 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్కులర్ జారీ చేసింది.
కొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రం..
ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ పీ వాసుదేవన్ పేరిట జారీ చేసిన సర్కులర్ లో సంబంధిత విధి విధానాలు వివరించారు. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న భారత ప్రభుత్వ ఆశయాలకు ప్రస్తుత ఆర్బీఐ నిర్ణయం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. దేశంలో కోట్లాది మందికి ఇప్పటికీ సరైన ఏటీఎం సౌకర్యం లేదు. బ్యాంకుల శాఖలు కూడా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో పీఓఎస్ ల నుంచి నగదు ఉపసంహరణ వల్ల చాలా వరకు నగదు కష్టాలు తీరుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
42.5 లక్షల పీఓఎస్ లు...
భారత్ లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల రాక చాలా ఆలస్యంగా మొదలైంది. ఎక్కడో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు మాత్రమే పరిమితమైన ఈ మెషిన్ లు ... 2016 లో ఇండియాలో నోట్ల రద్దు తర్వాత అత్యంత వేగంగా అన్ని ప్రాంతాలకు చేరువయ్యాయి. ప్రస్తుతం చిన్న చిన్నదుకాణాల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారిక గణాంకాల ప్రకారమే... 2019 లో మన దేశంలో మొత్తం 42.5 లక్షల పీఓఎస్ యంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో నగదు ఉపసంహరణ యంత్రాలుగా మారిపోనున్నాయి. అంటే దేశంలో కొత్తగా మరో 40 లక్షలకు పైగా ఏటీఎం లు ఏర్పాటు చేసినట్లే అవుతుంది.
అనుమతి అక్కరలేదు...
ఇప్పటి వరకు పీఓఎస్ యంత్రాల నుంచి నగదు ఉపసంహరణ సౌకర్యం కల్పించాలంటే ... ముందుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. కానీ ప్రస్తుత సర్కులర్ లో ఆ తప్పనిసరి నియమాన్ని రద్దు చేశారు. ఇక పై గుర్తింపు పొందిన అన్ని బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, ఆర్థరైజ్డ్ పేమెంట్ నెట్వర్క్ సంస్థలు ఈ విధానాన్ని స్వయంగా అమలు చేయవచ్చు. కానీ సంబంధిత డేటా ను మాత్రం ఆర్బీఐ కి అందించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఫోన్ పే, పేటీఎం వంటి సంస్థలు నగదు ఉపసంహరణ సేవలు ప్రారంభిస్తున్నాయి. దేశంలో తొలిసారి ఇలాంటి సౌకర్యాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్నేళ్ల క్రితమే ప్రారంభించింది. కానీ, అనేక కారణాల వల్ల అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ త్వరలో ఈ సేవలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నాయి.
పరిమితి లేదు..
తన తాజా ఆదేశాల్లో పీఓఎస్ యంత్రాల నుంచి నగదు ఉపసంహరణ చేయవచ్చని పేర్కొన్న ఆర్బీఐ ... కొన్ని కీలకమైన విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఒక్కో యంత్రం నుంచి ఎంత మేరకు నగదు ఉపసంహరణ చేయవచ్చో తన ఆదేశాల్లో పేర్కొనలేదు. అలాగే ఒక్కో వ్యక్తి కి ఒక రోజుకు గరిష్టంగా ఎంత మేరకు నగదు ఇవ్వవచ్చో కూడా తెలుపలేదు. కానీ బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక వ్యక్తికి ఒక రోజులో గరిష్టంగా రూ 5,000, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ 10,000 వరకు నగదు ఉపసంహరణకు అనుమతిస్తారని తెలిసింది. ఈ మేరకు త్వరలోనే బ్యాంకులకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.