లాక్డౌన్ తర్వాత నిత్యావసర ధరలు ఎలా పెరిగాయో తెలుసా? అలా చేస్తే క్రిమినల్ కేసు, జైలు
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో దీనిని ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగంచారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఏడేళ్ల పాటు జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా, వినియోగదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి పవన్ అగర్వాల్ రాష్ట్రాలకు లేఖలు రాశారు.
లాక్డౌన్ తర్వాత ఈ రంగాల దూకుడు, వీటికి చాలా టైమ్: ఉద్యోగాలపై ప్రభావం
పెరిగిన ధరలు
గత నెల చివరి వారం వరకు ధరలు కాస్త నియంత్రణలోనే ఉన్నాయి. ఏప్రిల్ తొలి వారం నుండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పండ్లు, కూరగాయలు, పప్పులు, నూనెలు సహా వివిధ నిత్యావసర ధరలు గతంలో కంటే కాస్త పెరిగాయి. కొన్ని ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్కు ముందు కిలో రూ.75 ఉన్న కందిపప్పు ఇప్పుడు రూ.110 దాటింది.
సప్లై చెైన్ తెగడంతో..
కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పప్పు ధాన్యాల బాగా పండుతాయి. ఇక్కడి నుండి సరఫరా తగ్గింది. వాహన రాకపోకలకు ఇబ్బందులు, సిబ్బంది కొరత వంటి వివిధ కారణాలతో ధరలు పెరిగాయి. మిగతా పప్పుల ధరలు కూడా పెరిగాయి. సప్లై చైన్ తెగిపోవడంతో ధరల పెరుగుదల 20 శాతం నుండి 25 శాతం వరకు పెరిగింది. పెసరపప్పు పది రోజుల్లోనే రూ.50కి పైగా పెరిగింది. క్రితం నెల కిలో రూ.180 ఉన్న చింతపండు ఇప్పుడు రూ.240కి చేరింది.
ఇష్టారీతిన పెంచకుండా..
సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పామాయిల్ ధరలు 20 శాతం వరకు పెరిగాయి. దీంతో పప్పు, నూనె ధరలను నియంత్రించాలని కేంద్రం.. రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా నిల్వలపై పరిమితులు విధించడం, ధరలు తగ్గించడం, డీలర్ల ఖాతాలు తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆహార ధాన్యాల కొరతను నివారించేందుకు కేంద్రం 109 ప్రత్యేక రైళ్ల ద్వారా చక్కెర, ఉప్పు, వంటనూనెలు, పప్పులు, బియ్యం వంటి సరుకులను రవాణా చేస్తున్నాయి. సరుకుల కొరత రాకుండా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
సూపర్ మార్కెట్లలో ప్యాకెట్స్ బంద్
సూపర్ మార్కెట్లలో ఇదివరకు వెళ్తే అరకిలో, కిలో ప్యాక్స్ కనిపించేవి. ఇప్పుడు అలా కనిపించడం లేదు. పప్పులు అన్ని విడిగానే అందుబాటులో ఉంటున్నాయి. ఇందుకు కార్మికులు పనిలోకి రాకపోవడమే కారణం. సరుకుల కొరత కారణంగా ప్యాకింగ్ చేయడం కూడా తగ్గింది.
మాల్స్లోను ధరలు పెరిగాయి
లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఎక్కడ చూసినా దుకాణాలు, మాల్స్ రద్దీగా కనిపిస్తున్నాయి. కస్టమర్లు చాలాసేపు వేచి చూడాల్సి వస్తోంది. మాల్స్లోను గత నెలతో పోలిస్తే ధరలు పెరిగాయని చెబుతున్నారు.
లాక్ డౌన్కు ముందు.. ఇప్పుడు
కందిపప్పు లాక్ డౌన్కు ముందు రూ.75 ఉండగా, ఇప్పుడు రూ.110 నుండి రూ.120కి చేరుకుంది. శనగ పప్పు రూ.40 నుండి దాదాపు రెండింతలు పెరిగి రూ.70కంటే పైకి చేరుకుంది. పెసర, మినపప్పులు రూ.30 వరకు పెరిగాయి. అల్లం రూ.90 నుండి 120, వెల్లుల్లి రూ.100 నుండి రూ.130, చక్కెర రూ.35 నుండి రూ.40, పల్లీ రూ.90 నుండి రూ.120, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.95 నుండి రూ.120కి పెరిగింది.
హైదరాబాద్ వంటి నగరాల్లో
హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఆంక్షల కారణంగా సరుకుల రవాణాలో అంతరాయం వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ధరలను అదుపు చేసేందుకు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ధరల పెరుగుదలపై 24 గంటల పాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.