ప్రైవేట్ రైళ్ల టెండర్లు క్యాన్సిల్: రూ.30 వేల కోట్లు: మళ్లీ మొదటి నుంచి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రైవేటు రైళ్ల ప్రక్రియకు టెండర్ల దశలోనే విఘ్నాలు ఎదురైనట్లు కనిపిస్తోంది. టెండర్ల ప్రక్రియను రైల్వే మంత్రిత్వ శాఖ అర్ధాంతరంగా రద్దు చేసింది. దాదాపు తుదిదశకు చేరుకున్న సమయంలో ఈ బిడ్డింగుల ప్రక్రియను రైల్వే శాఖ క్యాన్సిల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మళ్లీ మొదటి నుంచి ఆరంభించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ మేరకు బిజినెస్ టుడే వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 క్లస్టర్లలో ప్రైవేట్ రైళ్లను నడిపించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత ఏడాది జులైలో దీనికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను రైల్వే శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ 12 క్లస్టర్లలో కూడా మొత్తంగా 109 మార్గాల్లో రానుపోను రైళ్లను నడపించడానికి ఉద్దేశించిన బిడ్డింగ్ ప్రాసెస్ ఇది. కాంట్రాక్ట్ను దక్కించుకున్న ప్రైవేట్ కంపెనీకి రెవెన్యూ బిజినెస్ మోడల్ ఆధారంగా 35 సంవత్సరాల పాటు రాయితీ ఇస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు.
రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్లో మొత్తం 16 కంపెనీలో బిడ్డింగులను దాఖలు చేశాయి. ఇందులో- ఈ ప్రాజెక్టులో జీఎంఆర్ హైవేస్, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్, క్యూబ్ హైవేస్, సీఏఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వంటి మౌలిక రంగాలు, జాతీయ రహదారులకు సంబంధించిన కంపెనీలు టెండర్లను దాఖలు చేశాయి. ఈ ప్రాసెస్లో పాల్గొన్నాయి.
ఫైనాన్షియల్ బిడ్డింగ్ దశకు వచ్చే సరికి ఆయా కంపెనీలన్నీ వైదొలగిపోయాయి. చివరికి రెండు కంపెనీలు మాత్రమే మిగిలాయి. ఐఆర్సీటీసీతో పాటు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మాత్రమే ఫైనాన్షియల్ బిడ్డింగ్స్ దశకు చేరుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా 12కు గాను రెండు క్లస్టర్లపై మాత్రమే ఆసక్తి చూపాయి. బిడ్డింగుల్లో పొందుపరిచిన నిబంధనలు, మార్గదర్శకాలు రైల్వే మంత్రిత్వ శాఖకు అనుకూలంగా ఉన్న కారణంగా ఆయా కంపెనీలన్నీ టెండర్ల ప్రక్రియ తొలిదశలోనే తప్పుకొన్నట్లు అధికారులు గుర్తించారు.
దీనితో ఈ బిడ్డింగుల ప్రక్రియ మొత్తాన్ని కూడా రద్దు చేసి, మళ్లీ మొదటి నుంచి కొత్తగా మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నట్లు బిజినెస్ టుడే వెల్లడించింది. తన కథనంలో ఒకరిద్దరు రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను ఉటంకించింది. మళ్లీ కొత్తగా టెండర్ల ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఇంకా తెలియరాలేదని పేర్కొంది. 109 మార్గాల్లో ప్రైవేట్ రైళ్ల ఆపరేటర్లకు ఇవ్వాలని ప్రతిపాదించిన రాయితీలు రైల్వే శాఖకు అనుకూలంగా ఉండటం వల్లే ఆయా కంపెనీలు వైదొలగినట్లు స్పష్టం చేసింది.