Indian Railways: మహిళలకు రైల్వే శుభవార్త..రిజర్వేషన్ తో పాటు రక్షణ.. ఏఏ రైళ్లలో అంటే..
Indian Railways: మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త తెలిపింది. ఇప్పుడు రైలులో సీటు కోసం మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మహిళల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రి పెద్ద ప్రకటన చేశారు. బస్సులు, మెట్రో రైళ్లలో ప్రత్యేక సీట్లు ఎలా రిజర్వ్ చేయబడతాయో, అదే మాదిరిగా.. ఇప్పుడు భారతీయ రైల్వే కూడా మహిళలకు సీట్లను రిజర్వ్ చేయనుందని వెల్లడించారు.
ప్రత్యేక సౌకర్యాలు..
ఇప్పుడు రైళ్లలో మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్త్లను భారతీయ రైల్వే సుదూర రైళ్లలో కూడా అందుబాటులోకి తెస్తోంది. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా నెలాఖరులోగా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. సుదూర రైళ్లలో మహిళల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం.. రిజర్వ్ బెర్త్లతో సహా అనేక సౌకర్యాలను ప్రారంభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఏఏ రైళ్లలో..
సుదూర మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో.. స్లీపర్ క్లాస్లో ఆరు బెర్త్లు రిజర్వ్ చేయబడతాయని కేంద్ర మంత్రి తెలిపారు. గరీబ్ రథ్, రాజధాని, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లలోని థర్డ్ ఏసీ కోచ్ లో మహిళా ప్రయాణికుల కోసం ఆరు బెర్త్లు అందుబాటులో ఉంటాయి.
స్లీపర్ కోచ్లో కూడా రిజర్వేషన్..
ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్లు, ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ కోచ్లలో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్లు, సీనియర్ సిటిజన్ల కోసం ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ కోచ్లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్లు. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళా ప్రయాణికులకు, గర్భిణీ స్త్రీలకు రిజర్వ్ చేయబడ్డాయి. రైలులో ఆ తరగతికి చెందిన కోచ్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు జరుగుతాయని తెలుస్తోంది.
భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు ..
రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జిల్లా పోలీసులు ప్రయాణికులకు ఇందులో భాగంగా భద్రత కల్పిస్తారని తెలిపారు. దీంతో పాటు రైళ్లు, స్టేషన్లలో మహిళా ప్రయాణికులతో పాటు ఇతర ప్రయాణికుల భద్రత కోసం జీఆర్పీ సాయంతో రైల్వేశాఖ చర్యలు తీసుకుంటోంది.
రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు వారి ప్రయాణమంతా భద్రత కల్పించే లక్ష్యంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గత సంవత్సరం 'మేరీ సహేలి' అనే పాన్-ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.