COVID 19: నిత్యావసరాల కొనుగోళ్లపై నియంత్రణ! రంగంలోకి దిగిన సంస్థలు
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్లో ఉంది. ఏప్రిల్ 15వ తేదీకి ఇది పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారు. అయితే నిన్నటి వరకు లాక్ డౌన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందోననే అనుమానంతో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. ఇప్పటికీ ఈ ధోరణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) కీలక నిర్ణయం తీసుకుంది.
వాహన, ఆరోగ్య బీమా చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట
సరిపడే నిల్వలు..
కస్టమర్లు నిత్యావసరాల విషయమై ఆందోళన చెందవద్దని, సరిపడే నిల్వలు ఉన్నాయని RAI తెలిపింది. డీమార్ట్, స్పెన్సర్ వంటి రిటైలర్లు పలు రకాల సరుకుల మీద నియంత్రణ పెట్టారని RAI సీఈవో రాజగోపాలన్ అన్నారు. ప్రస్తుతం తమ స్టోర్స్లలో నిత్యావసరాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని, కొన్ని రకాల బ్రాండ్స్ తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని, అవి కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. గోదాముల్లో మూడు వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని రిటైల్ సంస్థలు చెబుతున్నాయి.
కొనుగోళ్లపై నియంత్రణ
సరుకుల కొరత లేదని, కానీ తమ తమ స్టోర్లలో వినియోగదారుల కొనుగోలు మీద నియంత్రణ పెట్టామని కొన్ని సంస్థల గ్రాసరీ స్టోర్స్ చెబుతున్నాయి. ఉదాహరణకు ఓ గ్రాసరీ స్టోర్లో బియ్యం 20 కిలోలు, పిండి 10 కిలోలు, పప్పు 4 కిలోలు, బిస్కట్స్ 12 ప్యాక్స్, చక్కెర 5 కిలోలు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అయితే అన్ని సంస్థల స్టోర్స్లలో మాత్రం నియంత్రణ లేదు. ఈజీడే వంటి స్టోర్స్లలో ఒక్కో వ్యక్తి కొనుగోలు చేసే వస్తువులు, సరుకులపై పరిమితులు ఉన్నాయి. డీమార్ట్లోను ఈ తరహా పరిమితి ఉంది.
అక్కడే ఇబ్బందులు..
ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ కార్మికులు, డ్రైవర్ల కొరత కారణంగా ఇబ్బందికరంగా మారింది. చాలామంది విధులకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో ఉన్న కార్మికులతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి. వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. దేశంలోని రవాణా ట్రక్కుల్లో దాదాపు 5 శాతం మాత్రమే తిరుగుతున్నాయి. ఉత్పత్తి చేసిన వస్తువుల లోడింగ్, అన్లోడింగ్కు కూలీలు దొరకడం లేదు. రోజువారీ ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని హెచ్యూఎల్, ఐటీసీ, డాబర్ ఇండియా, పార్లే, బీపీసీఎల్ తదితర సంస్థలు చెబుతున్నాయి.
సప్లై చైన్ తెగి 40 శాతం వరకు అమ్మకాలు క్షీణించాయి
లాక్ డౌన్ వంటి వివిధ కారణాలతో గత 15 రోజుల్లో సప్లై చైన్ తెగిపోవడంతో 30 శాతం నుండి 40 శాతం వరకు మోడర్న్ రిటైల్ క్షీణించిందని చెబుతున్నారు. ప్రస్తుతం కస్టమర్లు కూడా తక్కువ ఖరీదు ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తున్నారట. దీంతో అమ్మకాలు 21 శాతం నుండి 12 శాతానికి పడిపోయాయట.
ఇలా ఇబ్బందులు..
ముడి సరుకుల వాహనాలు, ప్యాకేజీంగ్ మెటిరీయల్ సప్లై ఆగిపోయిందని డాబర్ ఇండియా తెలిపింది. కొద్దిమంది కార్మికులతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్నామని, పూర్తిస్థాయి అనుమతులకు మరికొంత సమయం పడుతుందని ఐటీసీ పేర్కొంది. ఉత్పత్తులకు కొరత రాకుండా చూస్తున్నామని పార్లే తెలిపింది.