భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. ప్రపంచ ఆహార వ్యవస్థలో పెద్ద అగాథం ఏర్పడింది. గోధుమలు దొరకక వివిధ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. వాటి ఎగుమతులపై భారత్ గతంలో నిషేధం విధించడంతో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఒకరు.. భారత్ తన రైతులకు ఇస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత్ నిబంధనలు ఉల్లంఘిస్తోంది..
అమెరికా కాంగ్రెస్ లో 2023 ఫార్మ్ బిల్లుపై చర్చ జరిగింది. వ్యవసాయం, పోషకాహారం, అటవీ విధానంపై US సెనేట్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అర్కాన్సాస్కు చెందిన సెనేటర్ జాన్ బూజ్ మాన్.. భారత్ పై పలు ఆరోపణలు చేశారు. గోధుమ, వరి రైతులకు ఇండియా ఇస్తున్న సబ్సిడీల వల్ల తమ కర్షకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై బైడెన్ యంత్రాంగం ఇండియాతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తూనే ఉన్నాం..
"ఈ సమస్యపై వివిధ ఫోరంలలో భారత్ ను మేము ప్రశ్నిస్తున్నాము. WTOలో సైతం ప్రశ్నలు లేవనెత్తాము. వారి సబ్సిడీ విధానానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడానికి సంవత్సరాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నాం" అని USDA వాణిజ్యం, విదేశీ వ్యవసాయ వ్యవహారాల అండర్ సెక్రటరీ అలెక్సిస్ టేలర్ బదులిచ్చారు.
ఏం చేద్దాం..?
"ఈ వ్యవహారంలో ఇండియాపై ఉన్న ఆరోపణలను ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. అయితే భారత్ ను జవాబుదారిగా నిలబెట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? ఈ కమిటీ లేదా కాంగ్రెస్ తరఫున మేము ఏమైనా చేయగలమా ?" అని వ్యవసాయ కమిటీ ర్యాంకింగ్ మెంబర్గా ఉన్న బూజ్ మాన్ మరోసారి ప్రశ్నించారు.
ప్రత్యామ్నాయం చూస్తున్నాం..
USDA తరఫున భారత్ చర్యలను తిప్పికొట్టడానికి తన బృందంతో కలిసి పనిచేస్తున్నట్లు టేలర్ బదులిచ్చారు. వివిధ అంతర్జాతీయ ఫోరంలలో సబ్సిడీ విషయంపై ఇండియాను ప్రశ్నిస్తున్నామన్నారు. దేశీయంగా ఉన్న వరి, గోధుమ ఉత్పత్తిదారులకు స్పష్టత ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.