FD Rate Hike: ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు పెంచిన ప్రభుత్వ బ్యాంక్.. వారంలో రెండోసారి..
FD Rate Hike: ప్రైవేటు రంగంలోని బ్యాంకులకు పోటీగా పీఎస్ యూ దిగ్గజం కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు మంచి రాబడిని ఇచ్చేందుకు అదనపు రేటును ప్రకటించింది. రేట్ల పెంపు ఒకే నెలలో ఇది రెండోసారి కావటం గమనార్హం.
పెరిగిన రేట్లు ఇలా..
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని మరోసారి పెంచింది. కేవలం వారం వ్యవధిలో రెండవసారి FDపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్డీలకు ఈ పెంపు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. దేశంలోని మిగిలిన బ్యాంకుల మాదిరిగా ఆర్బీఐ రేట్ల పెంపుకు అనుగుణంగా వడ్డీ సవరింపులను బ్యాంక్ చేస్తూనే ఉంది.
వివిధ కాలాలకు..
వెబ్సైట్ లో బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం.. 46- 90 రోజుల FDలపై వడ్డీ రేటు 75 బేసిస్ పాయింట్ల మేర పెంచటంతో అది 4.50 శాతానికి చేరుకుంది. 180 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్డిలపై 5.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే ఏడాది నుంచి 599 రోజుల కాలానికి వడ్డీని 60 బేసిస్ పాయింట్లు పెంచటంతో అది 6.30 శాతానికి చేరుకుంది. అలాగే 600 రోజుల కంటే ఎక్కువ కాలానికి చేసే డిపాజిట్లపై 7 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తోంది.
సీనియర్ సిటిజన్లకు..
అదే విధంగా 2-3 సంవత్సరాలకు చేసే ఎఫ్డీలపై వడ్డీ 5.80 శాతం నుంచి 6.25 శాతానికి బ్యాంక్ పెంచింది. తాజా పెంపు తర్వాత మూడేళ్ల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి వడ్డీ రేటు 6.10 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 50 bps అదనపు వడ్డీని పొందుతారు. వీరికి 4 శాతం నుంచి అత్యధికంగా 7.50 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అదే విధంగా సూపర్ సీనియర్ సిటిజన్లకు 4.30 శాతం నుంచి 7.80 శాతం వరకు వడ్డీని ఎఫ్డీలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తోంది.