సుప్రీం వడ్డీ మాఫీ ఆదేశాలు, బ్యాంకులపై రూ.2వేలకోట్ల భారం
లోన్ మారటోరియంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులపై రూ.2వేల కోట్ల భారం పడనుంది. లోన్ మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేయాలని సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో రూ.1800 కోట్ల నుండి రూ.2000 కోట్ల మేర భారం పడుతుందని అంటున్నారు. మార్చి-ఆగస్ట్ 2020 మధ్య కాలంలో మారటోరియం ఎంచుకున్న అన్ని రుణ ఖాతాల చక్రవడ్డీని మాఫీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మొదట 60 శాతం మంది రుణగ్రహీతలు మారటోరియంను ఎంచుకున్నారు. ఇది క్రమంగా 40 శాతానికి తగ్గింది. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న కార్పోరేట్లు 25 శాతమే మారటోరియం ఎంచుకున్నారని అంచనా.
వడ్డీ మాఫీ వర్తింపు
కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్బీఐ వివిధ రుణ వాయిదాల చెల్లింపుపై కస్టమర్లకు ఊరటనిచ్చేలా గత ఏడాది ఆగస్ట్ వరకు ఆరు నెలల పాటు మారటోరియం వెసులుబాటు కల్పించింది. అయితే ఆ మారటోరియం కాలంలో అపరాధ వడ్డీ వసూలు చేయరాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గత ఏడాది మార్చి నుండి ఆగస్ట్ వరకు రుణ వాయిదాల చెల్లింపుపై ఆర్బీఐ మారటోరియం అమలులో ఉంది. లోన్ మారటోరియం అమలులో ఉన్నందున రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారికి గత ఏడాది నవంబర్ వరకు వడ్డీ మాఫీ వర్తిస్తుంది.
క్రమంగా పెరిగిన ఈఎంఐలు
రుణ వాయిదాల చెల్లింపులపై మారటోరియం వల్ల వడ్డీపై అపరాధ వడ్డీ భారం రూ.5,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఈ మారటోరియం కింద లబ్ధి పొందని రుణగ్రహీతలకు కాంపౌండ్ ఇంటరెస్ట్ సపోర్ట్ స్కీం కింద కేంద్రం అపరాధ వడ్డీ భారం భరిస్తుంది. ప్రారంభంలో దాదాపు 60 శాతం మంది మారటోరియం ఉపయోగించుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత 40 శాతానికి పడిపోయారు. ఈఎంఐల చెల్లింపులు క్రమంగా పెరిగాయి.
బ్యాంకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
ప్రయివేటుబ్యాంకుల్లో లోన్ మారటోరియంను ఉపయోగించుకున్నవారు 25 శాతం వరకు మాత్రమే. ఏదైనా బ్యాంకు 3 నెలల మారటోరియం ప్రకటిస్తే ఆ కాలానికి వడ్డీ మాఫీ అవుతుంది. గణాంకాల ప్రకారం అపరాధ వడ్డీ రేటు మాఫీకి గాను PSUs దాదాపు రూ.2వేల కోట్ల నష్టం వస్తుందని అంచనా. మారటోరియం సమయంలో అపరాధ వడ్డీ మాఫీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ భారం కేంద్రం భరించాలని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరింది. కేంద్రం దీనిని పరిశీలిస్తోంది.