ఏప్రిల్ 1 నుండే బ్యాంకుల మెగా విలీనం, కరోనా వల్ల వాయిదా లేదు
ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. విలీన బ్యాంకుల శాఖలు విలీనం చెందిన బ్యాంకుల శాఖలుగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలిపింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేయడానికి మార్చి 4వ తేదీన ప్రభుత్వం నోటిఫై చేసింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో విలీన ప్రక్రియను వాయిదా వేయాలని బ్యాంకు అధికారుల యూనియన్లు ఈ వారం ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాయి. అయితే విలీన ప్రక్రియ సరైన దిశలోనే కొనసాగుతుందని, ఏప్రిల్ 1వ తేదీ నాటికి అమలులోకి వస్తుందని నాలుగు రోజుల క్రితమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన గడువు పొడిగించే ప్రసక్తే లేదని, మొదట ప్రకటించిన ఏప్రిల్ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంకింగ్ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా ఆదివారం ప్రకటించారు. విలీన ప్రక్రియ కసరత్తు కొనసాగుతోందని, కరోనా వైరస్తో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామన్నారు.
కరోనా నేపథ్యంలో విలీనాల గడువును మరింత పొడిగించాలని అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ) ప్రభుత్వాన్ని కోరింది. దీనిని పొడిగించే ప్రసక్తి లేదని పాండా తెలిపారు. విలీనానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు సమాంతరంగా సాగుతున్నాయన్నారు. ఈ అంశంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు, యూనియన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు విలీనమవుతున్నాయి.