కరోనా మామూలుగా దెబ్బకొట్టలేదు.. భవిష్యత్తు అయోమయం
కరోనా మహమ్మారి-షట్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం అతి పెద్ద సవాలుగా మారుతోందని, ఆయా దేశాల రక్షణాత్మక చర్యలతో భారీ కష్ట-నష్టాలు ఏర్పడుతున్నాయని వరల్డ్ ఎకనమీక్ ఫోరమ్ (WEF) అధ్యయనంలో తేలింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా దీర్ఘకాలిక మాంద్యం, నిరుద్యోగం పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ కార్పోరేట్ కంపెనీలు వైరస్ పునర్ వ్యాప్తి, స్వీయ రక్షణ విధానాలతో ఇబ్బందులుపడనున్నాయి. మొత్తానికి రానున్న 18 నెలల్లో ఉద్యోగ కోతలు, సంస్థల దివాలా పెరగవచ్చునని తెలిపింది.
కొత్త పన్ను వేస్తాం: ఆపిల్ చైనా నుండి భారత్ రాకుండా ట్రంప్ బెదిరింపులు!
రానున్న 18 నెలల్లో
కరోనా కారణంగా కొనసాగుతున్న అంతర్జాతీయ మాంద్యానికి తోడు నిరుద్యోగం, ఆయా దేశాల రక్షణాత్మక ధోరణి అంతకంతకు పెంచడం సవాల్గా మారిందని సర్వేలో వెల్లడైనట్లు WEF తెలిపింది. గ్లోబల్ నేతలు, వ్యాపారులు, విధానకర్తలు కలిసి కరోనాను కట్టడి చేయకుంటే రానున్న 18 నెలల్లో ఆర్థిక బాధరు, సామాజిక అసంతృప్తులు తీవ్రంగా పెరుగుతాయని హెచ్చరించింది. 300కు పైగా ఇంటర్నేషనల్ రిస్క్ ప్రొఫెషనల్స్.. అంటే ముప్పును ముందుగా అంచనా వేసే నిపుణుల నుండి అభిప్రాయాలు సేకరించింది.
అసమానతలు, రాజకీయ అనిశ్చి, మానసిక ఆరోగ్యంలో మార్పు
ఈ స్టడీ ప్రకారం... మాంద్యంతో పాటు పెద్ద దేశాల ద్రవ్య పరిస్థితులు బలహీనపడటం, దేశాల మధ్య కఠిన ఆంక్షలు, అతిపెద్ద వర్థమాన దేశాలు దారుణపరిస్థితికి చేరుకోవడం, వంటివి రానున్న ఏడాదిన్నరలో వ్యాపారులకు సవాల్గా మారనుంది. దీంతో వాతావరణ సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, అసమానతలు, ప్రజల మానసిక ఆరోగ్యంలో మార్పులు, సాంకేతిక పాలనలో అంతరాలు, ఆరోగ్య వ్యవస్థలో ఒత్తిళ్లు కనిపించవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో మారిన ప్రజల మానసిక ప్రవర్తనపై జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది.
ఆర్థిక మాంద్యం మరింత ముదరవచ్చు..
మూడింట రెండొంతుల మంది వ్యాపారులకు అంతర్జాతీయ మాంద్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు లేక, తీసుకున్న అప్పులు తీర్చలేక చాలామంది వ్యాపారులు, సంస్థలు, పరిశ్రమల్లో భయాలు నెలకొన్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో అన్ని వ్యాపార, పరిశ్రమలు వ్యయ నియంత్రణ పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల కోత లేదా వేతన కోత కూడా కనిపిస్తోంది. దీంతో చాలా దేశాలను నిరుద్యోగ సమస్య పీడిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సహా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంభించడం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే వణికిస్తోందని చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం మరింత ముదురవచ్చునని ఆందోళనల వ్యక్తమవుతున్నాయి.
భవిష్యత్తు అయోమయం.. సైబర్ దాడులు
కరోనా దెబ్బతో భవిష్యత్తు అంతా అయోమయంగా మారింది. ప్రభుత్వ లక్ష్యాలు తలకిందులు అయ్యాయి. వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధి కుప్పకూలింది. వ్యక్తిగత జీవనంలోను పలు మార్పులు వచ్చాయి. దేశాల రక్షణాత్మక చర్యల వల్ల అంతర్జాతీయ మార్కెట్ దెబ్బతింటుంది. ఎకానమీలో డిజిటలైజేషన్ పెరుగుతున్నందున సైబర్ దాడులు, డేటా మోసాలు ప్రధాన సమస్యలుగా మారవచ్చు.
ఏడాదిన్నరలో కొన్ని తేరుకోకపోవచ్చు
కొన్ని దేశాల్లో కొన్ని పరిశ్రమలు, రంగాలు రాబోయే ఏడాదిన్నరలో కూడా తేరుకోకపోవచ్చు. ప్రపంచ నాయకులు, వ్యాపారులు పటిష్టమైన చర్యలు చేపడితే లాక్ డౌన్ లేదా షట్ డౌన్ ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా స్థిరమైన, సమసమాజ ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధి శకాన్ని ఆవిష్కరించవచ్చు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక మాంద్యం ఉంటుందని 66.3 శాతం మంది,
ఎన్పీఏలు పెరుగుతాయని 52.7 శాతం మంది, ప్రాపర్టీ రికవరీ కారణంగా ఇండస్ట్రీ, సెక్టార్స్ దెబ్బతినవచ్చునని 50.1 శాతం మంది ఇలా పది రకాల ఆందోళనలు వ్యక్తం చేశారు.