కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కుతాం, సిస్కో సర్వేలో ప్రొఫెషనల్స్ ధీమా..
కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు అటకెక్కాయి. కేంద్రం కాస్త సడలింపులు ఇస్తున్నా ఇవి పూర్తిస్ధాయిలో వ్యాపారాల పునరుద్ధరణకు అవకాశాలు కల్పించడం లేదు. దీంతో ఉద్యోగాలు, జీతాల్లో కోతలు తప్పనిసరి అవుతున్నాయి. అయినా సంక్షోభం బారి నుంచి త్వరలోనే వ్యాపారాలు గట్టెక్కుతాయని ఐటీ, వ్యాపార రంగంలో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ ధీమాగా ఉన్నారు. తాజాగా సిస్కో నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. ఈ సర్వేలో వృత్తి నిఫుణులు కరోనా కాలంలో తమ వ్యక్తిగత అంశాలను, వృత్తి సంబంధిత అంశాలతో ఎలా సమన్వయం చేసుకుంటున్నారనదీ స్పష్టమైంది.
హైదరాబాద్, అమరావతి సహా... వారికి మళ్లీ ఉద్యోగం, ఎస్బీఐ గుడ్న్యూస్
కరోనాలో వ్యాపారాలపై సిస్కో సర్వే..
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్దలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అందులో పనిచేసున్న వృత్తి నిపుణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రముఖ సర్వే సంస్ధ సిస్కో తాజాగా ఓ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో కరోనా సమయంలో వ్యాపారాల పరిస్ధితి ఎలా ఉంది, ఇళ్ల దగ్గరే ఉంటూ పనిచేస్తున్న వృత్తి నిఫుణుల స్పందన ఎలా ఉంది, భవిష్యత్తులో కరోనా సంక్షోభం నుంచి కోలుకుని వ్యాపారాలు తిరిగి గాడిన పడతాయా లేదా వంటి అంశాలపై సిస్కో దృష్టిసారించింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెషనల్స్ నిష్కర్షగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.
తిరిగి పుంజుకుంటామని ధీమా..
కరోనా సంక్షోభం వ్యాపార రంగాన్ని అతలాకుతలం చేస్తున్నా త్వరలోనే ఇది తిరిగి పుంజుకోవడం ఖాయమని సిస్కో సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది ప్రొఫెషనల్స్ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం తమ వ్యాపారాలను మరింత దృఢంగా మార్చడం ఖాయమని వారు విశ్వసిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది వ్యాపారాలు పుంజుకోవాలంటే ఐటీ నుంచి భారీ మద్దతు అవసరమని తేల్చారు. 77 శాతం మంది అయితే తిరిగి పాత రోజులు రావాలంటే కస్టమర్ సర్వీస్, సంతృప్త స్ధాయిలు పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. 76 శాతం మంది అయితే కరోనా కారణంగా వ్యాపారాలకు ఆటంకం ఏర్పడుతుందని భయాందోళనలు వ్యక్తం చేశారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ సవాళ్లు..
ప్రస్తుతం వ్యాపార సంస్ధలు అమలు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి కారణంగా అనుకోని సవాళ్లు ఎదురవుతున్నట్లు తమ సర్వేలో తేలిందని సిస్కో కొలాబరేషన్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అరుణా రవిచంద్రన్ తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా యాజమాన్యాలు, ఉన్నత స్ధానాల్లో ఉన్న వారు ఉద్యోగులతో నిరంతరం టచ్ లో ఉండేందుకు వీడియో కాన్పరెన్సింగ్ మీట్ అప్స్, సోషల్ ఛాట్ ఛానల్స్ ను వాడుతున్నట్లు తేలింది. ఇందులోనూ పలు సమస్యలు ఉన్నట్లు సిస్కో వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. తాజా పరిణామాలతో వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవాల్సి వస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతీ 10 మంది మేనేజర్లతో 9 మంది తెలిపారు.
ఉద్యోగులకు మరిన్ని ఆఫర్లు..
కరోనా కారణంగా ఉద్యోగులను ఇళ్ల వద్ద ఉంచి పనిచేయించేందుకు సిద్దమవుతున్న కార్పోరేట్ సంస్ధలు.. భవిష్యత్తులోనూ ఇదే వైఖరి కొనసాగించవచ్చనే అభిప్రాయం ఈ సర్వేలో వెల్లడైంది. మరింత మందిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించడంతో పాటు వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాము సిద్ధమవుతున్నట్లు పలు కార్పోరేట్ సంస్ధల యాజమాన్యాలు వెల్లడించాయి. అలాగే సౌకర్యవంతమైన పని గంటలను కల్పించేందుకు కూడా యాజమాన్యాలు రెడీ అంటున్నాయి. దీంతో ఉద్యోగుల పనితనం కూడా మెరుగై మంచి ఫలితాలు వస్తాయని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే నిర్వహించిన సిస్కో సంస్ధ కూడా కరోనా సమయంలో తమ వెబెక్స్ వీడియో ప్లాట్ ఫామ్ ద్వారా యాజమాన్యాలకూ, ఉద్యోగులకు మధ్య 25 మిలియన్ మీటింగ్స్ నిర్వహించినట్లు వెల్లడించింది.