'ప్రయివేటీకరణతో ఇబ్బందిలేదు, కానీ ఈ టైంలో భయంకర ఆలోచన'
రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్ని ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై గణాంకాల విభాగం మాజీ చీఫ్ ప్రణబ్ సేన్ స్పందించారు. ప్రస్తుత కరోనా సంక్షోభం సమయంలో సరైనది కాదని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ మంచి ఆలోచన కానీ, బ్యాడ్ సమయంలో వచ్చిందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల (PSU) ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ప్రణబ్ సేన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ జోరు మీద ఉన్నప్పుడు PSUల ప్రయివేటీకరణ ఉత్తమమని, ఆర్థికమాంద్యంలో కూరుకుపోయిన ఈ సమయంలో చేయాలనుకోవడం భయంకరమైన ఆలోచన అన్నారు.

ప్రయివేటీకరణతో సమస్య కాదు కానీ
బ్యాంకుల ప్రయివేటీకరణకు ఇది సరైన సమయం కాదని ప్రణబ్ సేన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్య మండలి PHD చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. తొలిసారి ప్రయివేటీకరణ అనే పదాన్ని బడ్జెట్లో చురుగ్గా ఉపయోగించారన్నారు. ప్రయివేటీకరణతో తనకు ఎలాంటి సమస్య లేదని, కానీ ప్రయివేటీకరించే సమయంతోనే అసలు సమస్య అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సరికాదన్నారు. అంతేకాదు, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగాల కల్పన ఊసులేదని వ్యాఖ్యానించారు.

భయంకరమైన ఆలోచన
ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ మేలు అని, కానీ మాంద్యం నెలకొన్న సమయంలో ప్రయివేటీకరణ ఆలోచన భయకరమైనదన్నారు. ఆర్థిక రంగం మరింత క్షీణించిన ఈ సమయంలో ప్రస్తుత అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలనే ఆలోచన తప్పేనన్నారు. నిర్మలా సీతారామన్ గతానికి భిన్నంగా ఉపాధి అంశాలను ప్రస్తావించలేదన్నారు.

నిధుల కేటాయింపు
ఈ బడ్జెట్లో కొన్ని అతిపెద్ద ప్రాజెక్టులకు నిధులను కేటాయించలేదని ప్రణబ్ సేన్ అన్నారు. కేవలం ఎంఎస్ఎంఈ రంగం గురించి మాత్రమే ఆర్థికమంత్రి ప్రస్తావించారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ద్రవ్యలోటు 3.5 శాం నుండి 9.5 శాతానికి పెరగవచ్చునని తెలిపారు. ఎకానమీతో పోల్చుకుంటే ఫిస్కల్ ప్యాకేజీ చిన్నది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల అమ్మకం ద్వారా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రూ.1.75లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రయివేటీకరణ జాబితాలో రెండు PSU బ్యాంకులు, ఒక బీమా కంపెనీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications