ప్రైవేటు రైళ్ల రేసులో టాటా, అదానీ, హ్యుండాయ్: ధరలు ఆ సంస్థల ఇష్టం!
ఇండియన్ రైల్వేస్ దేశంలోని 100 మార్గాల్లో ప్రయివేటు రైళ్లను నడిపేందుకు చర్యలను వేగవంతం చేసింది. బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని తేజాస్ రైళ్లను పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు కంపెనీలకు అందిన ఆహ్వానానికి విశేష స్పందన లభించింది. దాదాపు 24కు పైగా ప్రపంచస్థాయి సంస్థలు ఆసక్తి కనబరిచాయి.
రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్
తేజాస్ రైళ్ళ కోసం పోటీ
ఆల్సోటామ్ ట్రాన్సుపోర్ట్, బంబార్డియర్, సీమన్స్ ఏజీ, హ్యుండాయ్ రోటెమ్ వంటి సంస్థలు ఆసక్తిని చూపించాయి. పలు దేశీయ కంపెనీలు కూడా ప్రయివేటు రైళ్లపై ఆసక్తి కనబరుస్తున్నాయి. టాటా రియాల్టీ, హిటాచీ ఇండియా, ఎస్సెల్ గ్రూప్, అదానీ పోర్ట్స్ వంటి సంస్థలు ఉన్నాయి.
వంద మార్గాల గుర్తంపు
ఇండియన్ రైల్వే ఇప్పటికే వంద మార్గాలను గుర్తించింది. 150 రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ వంద రూట్లను 10 నుండి 12 క్లస్టర్లుగా మార్చారు. ముంబై - ఢిల్లీ, చెన్నై - న్యూఢిల్లీ, న్యూఢిల్లీ - హౌరా, షాలిమార్ - పుణే, న్యూఢిల్లీ - పాట్నా వంటి మార్గాలు ఉన్నాయి.
ధరలు.. సంస్థల నిర్ణయం
ప్రతి రైలులో కనీసం 16 కోచ్లు ఉంటాయి. ఆ మార్గంలో ప్రయాణించే అతి పెద్ద రైలు కంటే ఎక్కువ కోచ్లు ఉండకూడదు. ఈ ప్యాసింజర్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా అనుమతులు ఉన్నాయి. ఈ మార్గంలో ధరలను ఆయా సంస్థలు నిర్ణయించుకోవచ్చు. రైళ్ల నిర్వహణ, కొనుగోలుకు సంబంధించిన నిధులను ఆయా సంస్థలే సమకూర్చుకోవాలి. ఆ రైళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యత వారిదే. రైళ్ల ప్రయాణంలోను సమయ నిబంధన ఉంది.
బడ్జెట్లో కేటాయింపులు
2020 బడ్జెట్లో వీటి కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు. కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందులో కేవలం సిగ్నలింగ్, టెలికామ్ కోసమే రూ.1,650 కోట్లు కేటాయించారు. రూ.2,250 కోట్లు గాగ్ కన్వర్షన్ కోసం, రూ.700 కోట్లు డబ్లింగ్, రూ.5,786.97 కోట్లు రోలింగ్ కోసం కేటాయించారు.