బడ్జెట్కు సూచనలు ఇవ్వండి: ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు వివిద రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తాజాగా, బడ్జెట్కు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుందని, ఈ ఏడాది తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్కు మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నానని పేర్కొన్నారు. మీ సలహాలు, సూచనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని చెప్పారు. బడ్జెట్కు సలహాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే కోరారు.
కాగా, 2019-20 భారత జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠస్థాయి 5 శాతానికి పరిమితం కానుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విషయం తెలిసిందే. 2008-09లో 3.1 శాతంగా ఉన్న వృద్ధి రేటుకు ఆ తర్వాత ఇదే కనిష్ఠస్థాయి కానుంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయింది. ఈసారి వృద్ధి క్షీణతకు వస్తు తయారీ రంగం పడకేయడమే ప్రధాన కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది.
మంగళవారం జాతీయ ఆదాయంపై తొలి విడత ముందస్తు అంచనాలను విడుదల చేసింది. 2019-20లో వస్తు తయారీ రంగ వృద్ధి రెండు శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. 2018-19లో మాన్యుఫాక్చరింగ్ రంగం 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీతో పాటు వ్యవసాయం, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాల పని తీరు కూడా పేలవంగా ఉందని, మైనింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగాలు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయని నివేదిక తెలిపింది.