Srilanka Crisis: పొరుగు దేశం శ్రీలంక పరిస్థితి గత కొన్ని నెలలుగా చాలా దారుణంగా ఉంది. ఆర్థిక రంగంలో సమస్యలతో మొదలైన సంక్షోభం ఇప్పుడు రాజకీయ అస్థిరతను సృష్టించింది. ప్రజా తిరుగుబాటు మధ్య శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయబోతున్నారు. ఈ పరిస్థితులు ఇక్కడితో ఆగలేదు ఇప్పుడు అవి అధిక ఆహార ధరలకు కారణమౌతున్నాయి. నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెద్ద నేతలందరూ ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లో తలదాచుకుంటుండగా.. సైన్యం పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది.

చుక్కలనంటిన నిత్యావసరాలు..
శ్రీలంక రాజధాని కొలంబోలోని ఫోస్ మార్కెట్ తాజా సమాచారం ప్రకారం.. టమాట ధర కిలో రూ.150కి చేరింది. అదేవిధంగా ముల్లంగి ధర కిలో రూ.490కి చేరుకోగా.. ఉల్లి కిలో రూ.200, బంగాళదుంప రూ.220కి దొరుకుతున్నాయి. సాధారణంగా ఉపయోగించే బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాలు వంటి కూరగాయల ధరలు పెరగడంతో అక్కడి ప్రజల సమస్యలు కూడా పెరిగాయి. ఇప్పటికే శ్రీలంకలో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడి ప్రజలు విపరీతమైన విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న తరుణంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

అస్తవ్యస్తమైన లంక ఆర్థిక వ్యవస్థ..
పక్క దేశంలో మందులు కూడా అయిపోయాయి. పెట్రోల్ బంకుల వద్ద కూడా సైన్యాన్ని కాపలాగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన కొరత కారణంగా.. కనీసం ప్రజలు ఆస్పత్రులకు చేరుకోవటానికి కూడా కుదరటం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 2.2 కోట్ల జనాభా కలిగిన లంక దేశం ఇలాంటి పరిస్థితిని తొలిసారిగా ఎదుర్కొంటోంది. దీని వెనుక పర్యాటకాన్ని కరోనా మహమ్మారి దెబ్బతీయటం, సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వ ఆలోచన, చైనాతో పాటు ఇతర అప్పులు దేశాన్ని కుదేలు చేశాయని తెలుస్తోంది. కొన్ని సార్లు ప్రజలు ఇంధనం కోసం రోజుల పాటు లైన్లలో నిల్చోవలసి వస్తోంది. ఇక స్కూళ్లు సైతం ఇప్పటికే మూతపడ్డాయి.


Click it and Unblock the Notifications