Power crisis in India: చైనా మాత్రమే కాదు, భారత్లోను కోల్ సంక్షోభం
ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా గత కొంతకాలంగా బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల భారత్ కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనాతో పాటు మన దేశంలోను బొగ్గు కొరత, ధరల పెరుగుదల కారణంగా, దిగుమతిలో ఇబ్బందుల కారణంగా పరిశ్రమలు మూతబడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో నిన్న చైనా, నేడు భారత్ మాత్రమే కాదు. పలు దేశాలు ఉన్నాయి. చైనాలో విద్యుత్ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేదు. ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారు చైనా. ఇక్కడ విద్యుత్ సంక్షోభం కారణంగా ఉత్పత్తి దెబ్బతింటోంది. ఇప్పుడు మన దేశంలో పరిశ్రమలు మూతబడుతున్నాయి. నగరాల్లో విద్యుత్ కోత విధిస్తున్నారు.
ప్లాంట్లో నిల్వలు
అక్టోబర్ 6వ తేదీ నాటికి భారత దేశంలోని 135 కోల్ పవర్డ్ ప్లాంట్స్లో 80 శాతం ప్లాంట్స్లో కేవలం ఎనిమిది రోజుల ఉత్పాదక శక్తి మాత్రమే ఉంది. ఇందులోను సగాని కంటే ఎక్కువ ప్లాంట్స్లో కేవలం రెండు రోజుల ఉత్పత్తికి సరిపడే బొగ్గు ఉంది. కరోనా నుండి కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థపై/రికవరీపై విద్యుత్ సంక్షోభ ప్రభావం పడతుంది. ఇప్పటికే చైనా పైన బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపింది. మన దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సమయంలో... విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో బొగ్గు కొరత ఆందోళనను కలిగిస్తోంది. గత నాలుగేళ్లుగా చూస్తే దేశంలోని విద్యుత్ ప్లాంట్స్లో సగటు బొగ్గు నిల్వలు 18 రోజుల సరఫరాకు సరిపోను ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనుబంధ సంస్థ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ హెటాల్ గాంధీ అన్నారు.
వచ్చే మార్చి వరకు ఇదే ఇబ్బంది
డిసెంబర్ నాటికి ఈ నిల్వలు ఎనిమిది రోజుల నుండి పది రోజులకు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. వచ్చే మార్చి నాటికి గానీ సగటున 18 రోజుల నిల్వలు ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆరునెలల పాటు ఇందుకు సంబంధించి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా ప్రభుత్వరంగ కోల్ ఇండియాదే. గత నెలలో విద్యుత్ ప్లాంట్స్లో బొగ్గు కొరతను తీర్చడానికి యుటిలిటీలకు సరఫరాను పెంచుతున్నట్లు తెలిపింది. సరఫరా కారకాలు, బొగ్గు దిగుమతుల తగ్గుదల ప్రస్తుత సంక్షోభానికి దారితీసినట్లుగా చెబుతున్నారు.
బొగ్గుపై వీటి ప్రభావం
భారత్లో ఏప్రిల్ - ఆగస్ట్ మధ్య విద్యుత్ డిమాండ్ పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న సమయం ఇది. చాలామంది ఉహించిన దానికంటే ఆర్థిక రికవరీ వేగంగా పుంజుకుంటోందని చెబుతున్నారు. థర్మల్ పవర్ కంపెనీలు బొగ్గు నిల్వలను తక్కువగా కలిగి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం ఇంత త్వరగా ఆర్థిక రికవరీ పుంజుకొని, విద్యుత్ డిమాండ్ అందుకుంటుందని ఊహించలేదని చెబుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ఇతర వనరుల విషయానికి వస్తే జల విద్యుత్, గ్యాస్, అణు విద్యుత్ ఉన్నాయి. ఇవి కూడా క్షీణించాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం జల విద్యుత్ ఉత్పత్తిని ప్రభావితం చేసింది. గ్యాస్ ధరలలో పెరుగుదల న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్పై ప్రభావం చూపాయి. ఇవి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలకు దారి తీశాయి. వర్షాకాలం కారణంగా లాజిస్టిక్ అంశాలు బొగ్గు సరఫరాను ప్రభావితం చేశాయి.
బొగ్గు నిల్వలు భారీగా ఉన్నప్పటికీ,
దేశంలో బొగ్గు నిల్వలు భారీగా ఉన్నప్పటికీ, ప్రపంచంలో అతిపెద్ద మూడో అతిపెద్ద దిగుమతిదారు భారత్. అంతర్జాతీయ బొగ్గు ధరలు, దేశీయ బొగ్గు ధరల మధ్య ధరల అంతరం పెరుగుతుండటంతో ఇటీవలి కాలంలో దిగుమతులు తగ్గాయి. అదే సమయంలో ఇటీవల సరఫరా తగ్గింది. అదే సమయంలో డిమాండ్ పెరిగింది.
విద్యుత్ ప్లాంట్స్ ద్వారా బొగ్గు దిగుమతులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే జూలై, ఆగస్ట్ కాలంలో 45 శాతం తగ్గాయి. అయితే విద్యుతేతర రంగాలు దేశీయ బొగ్గుపై ఎక్కువగా ఆధారపడ్డాయి. అల్యూమినియం, స్టీల్, సిమెంట్ కాగితం వంటి విద్యుతేతర పరిశ్రమలు సాధారణంగా వేడిని ఉత్పత్తి చేయడానికి పెద్ద మొత్తంలో బొగ్గును ఉపయోగిస్తాయి.
దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడిన తీర విద్యుత్ ప్లాంట్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో క్షీణత, ఉత్పత్తిని పెంచేందుకు దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్స్ పై మరింత ఒత్తిడిని పెంచింది. బొగ్గు దిగుమతిలో అంతరాయం ఏర్పడింది. ఉదాహరణకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మహమ్మారి నుండి కోలుకుంటున్నందున ఓడ రేవుల్లో షిప్పింగ్, రద్దీకి అధిక డిమాండ్ ఉండటంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి.
దేశంలో బొగ్గు ధరలను ఎక్కువగా ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా నిర్ణయిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడు దేశీయ ధరలు గణనీయంగా పెరగవు. దేశంలో చాలామంది రైతులకు, చాలా ఇళ్లకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వబడింది. దీంతో ఈ భారం పారిశ్రామిక వినియోగదారులపై పడుతోందని చెబుతున్నారు.
ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమైంది. దీనికి తోడు ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా విద్యుత్ డిమాండ్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టింది.
కేంద్రమంత్రి కూడా తగినంత బొగ్గు ఉందని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు అవసరం లేదని చెప్పారు.