రూ.30 లక్షలకు సైబర్ దాడి, బిగ్ బాస్కెట్లో 2 కోట్ల మంది డేటా లీక్: క్రెడిట్ కార్డు వివరాల్లేవ్!
గ్రాసరీస్ ఈ-కామర్స్ ప్లాట్ఫాం బిగ్ బాస్కెట్ డేటా చోరీకి గురైంది. ఈ మేరకు సైబర్ ఇంటెలిజెన్స్ సిబెల్ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం ఓ ఫార్మా కంపెనీలోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. తాజాగా బిగ్ బాస్కెట్లో డేటా చౌర్యం జరగడం గమనార్హం. సైబర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 2 కోట్ల మందికి పైగా వినియోగారుల వివరాలు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించి బెంగళూరు సైబర్ సెల్లో కంపెనీ ఫిర్యాదును అందించింది. డేటా చోరీకి సంబంధించి సైబర్ నిపుణులు రంగంలోకి దిగారు.
కరోనా: ఐటీ కంపెనీలకు ఇదో పెద్ద అనుభవం, మార్చి నాటికి 20% వర్క్ ఫ్రమ్ హోమ్
రూ.30 లక్షలకు డేటా చోరీ
బిగ్ బాస్కెట్ డేటాను చోరీ చేసిన హ్యాకర్లు వాటిని దాదాపు రూ.30 లక్షలకు విక్రయానికి పెట్టినట్లుగా కూడా సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. డార్క్ వెంబ్ పరిశీలనలో భాగంగా బిగ్ బాస్కెట్ డేటా చోరీని తమ పరిశోధన బృందం గుర్తించిందని, ఈ వివరాలను దాదాపు రూ.30 లక్షలకు అమ్మకానికి పెట్టారని, రెండు కోట్ల మంది కస్టమర్లతో కూడిన ఎస్క్యూఎల్ ఫైల్ పరిమాణం దాదాపు 15GB ఉందని సిబెల్ తెలిపింది. ఇందులో ఈ-మెయిల్ ఐడీలు, మొబైల్ నెంబర్లు, అడ్రస్లు, పుట్టిన తేదీ, ఐపీ అఢ్రస్ ఉన్నట్లు తెలిపింది. డేటా చోరీ అక్టోబర్ 30వ తేదీన జరిగినట్లు గుర్తించినట్లు సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని బిగ్ బాస్కెట్కు వెంటనే తెలియజేసినట్లు వెల్లడించింది.
ఆ వివరాల్లేవు.. క్రెడిట్ కార్డు డేటాకు ముప్పులేదు
బిగ్ బాస్కెట్ కస్టమర్లకు కూడా హామీ ఇచ్చింది. కస్టమర్ల గోప్యత, భద్రత తమకు చాలా ముఖ్యమని, క్రెడిట్ కార్డు నెంబర్లు సహా ఎలాంటి ఆర్థిక వివరాలను భద్రపరచడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. తమ దగ్గర క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు ఉండవని, కాబట్టి ఆ డేటాకు సంబంధించి ముప్పు లేదని తెలిపింది. డేటా చౌర్యాన్ని కట్టడి చేయడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కలిసి పని చేస్తున్నామని కూడా బిగ్ బాస్కెట్ తెలిపింది. అలాగే బెంగళూరులోని సైబర్ క్రైమ్ సెల్కు ఫిర్యాదు చేశామని వెల్లడించింది.
15 రోజుల తర్వాత గుర్తింపు
తమ డేటాలో కస్టమర్లకు సంబంధించిన ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు, ఆర్డర్ వివరాలు, చిరునామాలు మాత్రమే ఉంటాయని బిగ్ బాస్కెట్ తెలిపింది. డేటా చౌర్యం అక్టోబర్ 14వ తేదీన జరిగిందని, పదిహేను రోజుల తర్వాత గుర్తించినట్లు తెలిపింది. డేటా చౌర్యాన్ని గుర్తించడంతో నవంబర్ 1వ తేదీన బెంగళూరు బిగ్ బాస్కెట్ ప్రధాన కార్యాలయానికి తెలిపింది.