కొత్త నాణేలు రాబోతున్నాయ్: రూ.10, రూ. 20 సహా: వాటిపై దేన్ని ప్రింట్ చేశారో తెలుసా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వాళ రెండు కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఐకనిక్ వారోత్సవాలను ప్రారంభించనున్నారు. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం షెడ్యూల్ అయింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వీటిని నిర్వహించనుంది కేంద్రప్రభుత్వం. ఇవ్వాళ్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ వారోత్సవాలు నిర్వహించనుంది. మొత్తంగా 75 ప్రాంతాల్లో వైభవంగా జరిపించేలా ఏర్పాట్లు చేసింది. ముగింపు కార్యక్రమం కూడా అంతే ఘనంగా నిర్వహించనున్నారు ఆయా శాఖల అధికారులు.
కేంద్ర ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన వారోత్సవాలు ఇవి. విజ్ఞాన్ భవన్లో దీన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, సహాయ మంత్రులు డాక్టర్ భగత్ కిషన్ రావ్ కరద్, పంకజ్ చౌదరి, రావ్ ఇందర్జిత్ సింగ్, పలువురు అధికారులు దీనికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ వారోత్సవాలను ప్రధాని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా జన్ సమర్థ్ పోర్టల్ను ఆయన ఆవిష్కరించనున్నారు. వన్-స్టాప్ డిజిటల్ పోర్టల్ ఇది. కేంద్రప్రభుత్వం అమలు చేసే క్రెడిట్ పథకాలన్నింటినీ ఈ పోర్టల్ ద్వారా ఒకే వేదిక మీదికి తీసుకొచ్చారు. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక సంవత్సరాల వారీగా అన్ని రంగాలు సాధించిన పురోగతిని ఇందులో పొందుపరిచారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, లక్ష్యాలను అందుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఇందులో ప్రస్తావించి ఉంటాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని- కొత్త నాణేలను ప్రధాని విడుదల చేయనున్నారు. 1, 2, 5, 10, 20 సిరీస్కు చెందిన రూపాయి నాణేలను ఆయన చలమాణిలోకి తీసుకొస్తారు. ఈ నాణేలపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను ముద్రించి ఉంటుంది. అంధులు కూడా సులభంగా గుర్తించాల వాటిపై అంకెలను ముద్రించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనితో పాటు ఎనిమిది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధించిన ప్రగతిని తెలియజేసేలా రూపొందించిన డిజిటల్ ఎగ్జిబిషన్ను కూడా మోడీ ప్రారంభిస్తారు.