విదేశాల్లో ఉన్న ఆర్థిక నేరగాళ్లకు మోడీ 'మెసేజ్', క్రిప్టోపై కీలక వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీ పైన ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో నిబంధనలపై చర్చించాల్సిన అవసరముందన్నారు. అలాగే, యంగ్ క్రిప్టో యూజర్స్కు సూచన చేశారు. ఇక బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్లిన ఆర్థిక నేరగాళ్లు తిరిగి భారత్కు రావాలని చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఉద్యోగ కల్పనలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. క్రియేటింగ్ సినర్జీస్ ఫర్ సీమ్లెస్ క్రెడిట్ఫ్లో అండ్ ఎకనామిక్ గ్రోత్ పేరిట నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. బ్యాంకులకు ప్రభుత్వం నుండి వీలైనంత మద్దతు ఇస్తామన్నారు. గత ఆరేడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా నేడు బ్యాంకింగ్ రంగం బలపడిందని చెప్పారు. మొండి బకాయిల వసూళ్లలో పురోగతి కనిపించినట్లు చెప్పారు. రూ.5 లక్షల కోట్లకు పైగా బకాయిలను వసూలు చేశాయన తెలిపారు.
ఎన్పీఏ, బ్యాంక్లకు మూలధనం సమకూర్చడం వంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద సరిపడా మూలధనం ఉండటంతో పాటు ఎన్పీఏల భారం కూడా తగ్గిందన్నారు. కేంద్రం దివాల చట్టాలను తీసుకురావడంతో పాటు రికవరీ ట్రైబ్యూనల్స్ను బలోపేతం చేసిందని, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలను పరిష్కరించారని తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులు వ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు భాగస్వామ్య విధానాలను అనుసరిస్తున్నాయని, రుణదాతల వలే వ్యవహరించడాన్ని వదిలించుకొన్నాయన్నారు. బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లతో దేశ బ్యాలెన్స్ షీట్ను వృద్ధి చేయాలన్నారు.
నిర్దిష్ట నేరస్థులను ప్రస్తావించకుండా మోడీ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులు తిరిగి రావాలని చెబుతూ, వారిని తీసుకు రావడానికి తాము చట్టాల పైన ఆధారపడ్డామని, దౌత్య మార్గాలను ఉపయోగించామని చెప్పారు. వర్చువల్ కరెన్సీలను నియంత్రించడంలో సహకరించాలని, ప్రజాస్వామ్య దేశాలు వీటిలో విఫలమైతే అవి తప్పుడు చేతుల్లోకి వెళ్లవచ్చునన్నారు.