PhonePe IPO: ఫిన్టెక్ కంపెనీ ప్లాన్లు మామూలుగా లేవుగా..
ముంబై: బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రముఖ డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఫోన్పే.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (PhonePe IPO)కు రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది.
రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ కోసం..
ఇందులో భాగంగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు అందజేయాల్సిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను రూపొందించబోతోంది. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా నిర్వహిస్తోన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ పోర్ట్ఫోలియోలో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకోవడానికి అవసరమైన నిధులను పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించింది.
10 బిలియన్ డాలర్ల వరకు..
ప్రస్తుతం కంపెనీ వాల్యుయేషన్ను రూపొందించే ప్రక్రియ చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫోన్పే కంపెనీ వాల్యుయేషన్ ఎనిమిది నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తోన్నాయి. ఐపీఓను జారీ చేసే క్రమంలో- త్వరలోనే బ్యాంకర్లు, లీగల్ కన్సల్టెంట్లు, ఇతర ఫైనాన్షియల్ అడ్వైజర్లను నియమించుకోవచ్చని తెలుస్తోంది.
సింగపూర్ నుంచి..
ఫ్లిప్కార్ట్ గ్రూప్ కంపెనీల్లో ఫోన్పే ఒకటి. వాల్మార్ట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ పేరు మీదా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఫోన్పే రిజిస్టర్డ్ హోల్డింగ్స్ ఎంటైటీని సింగపూర్ నుంచి భారత్కు తరలించే ప్రయత్నాల్లో ఉంది. దీన్ని సింగపూర్ నుంచి భారత్కు తరలించడానికి ఇదివరకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా అంగీకరించారు.
ఫ్లిప్కార్ట్.. వాల్మార్ట్
2015లో ఏర్పాటైన ఫిన్టెక్ సంస్థ ఇది. సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజినీర్ దీన్ని నెలకొల్పారు. 2018లో దీన్ని వాల్మార్ట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ టేకోవర్ చేసుకుంది. ఫ్లిప్కార్ట్ బ్యానర్ కింద కొనసాగుతోంది. యూపీఐ ఆధారిత లావాదేవీలు భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాలను కూడా చేపట్టబోతోంది.
5,200 మందికి ఉద్యోగాలు..
ఈ ఏడాది డిసెంబర్ నాటికి 5,200 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం 2,600 మంది పని చేస్తోన్నారు. బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీల్లో ఓపెన్ జాబ్ పొజీషన్లో మరో 2,800 మంది పని చేస్తోన్నారు. వారికి అదనంగా మరో 5,200 మందిని తీసుకోవడానికి కసరత్తు చేస్తోంది.
మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం..
2020లో ఫోన్పే.. తన ప్రమోటర్స్ ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ ద్వారా 700 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ను సాధించింది. టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, చైనాకు చెందిన టెన్సెంట్ ద్వారా మరో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది. అలాగే- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హోదా పొందడానికీ ప్రయత్నాలు చేస్తోంది.
పేటీఎం తరువాత..
వెల్త్డెస్క్, ఓపెన్ క్యూ, గిగ్ఇండియాలను టేకోవర్ చేయాలనీ భావిస్తోంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ సెగ్మెంట్లో ఆధిపత్యాన్ని సాధించింది ఫోన్పే. 47 శాతం మార్కెట్ షేర్ను సొంతం చేసుకుంది. కాగా- ఇదే సెగ్మెంట్కు చెందిన పేటీఎం గత ఏడాదే పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదే రంగానికి చెందిన మొబిక్విక్ కూడా ఐపీఓకు రానుంది.