కరోనాకు కొత్త విధానాలు: డాక్టర్ రెడ్డీస్, స్పుత్నిక్-వీ సమర్థత ఎంతంటే
కరోనా రోగులకు సరికొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సహ ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. వచ్చే కొన్ని నెలల్లో వీటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని, ఇదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల శ్రేణి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఎదురుకాకుండా చూస్తామన్నారు. ఇప్పటికే రష్యా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకాను దేశీయంగా డాక్టర్ రెడ్డీస్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. డీఆర్డీవోతో సహా వివిధ సంస్థలతో ఈ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
'బిట్ కాయిన్ ఆ ఒక్క కారణంతో కొనుగోలు చేస్తారు, నేను ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయను'
సేవలకు మేం సిద్ధం..
కరోనా రోగులకు వీలైనంతగా, అత్యంత వేగంగా సేవలందించేందుకు తాము సిద్ధమని, కరోనా చికిత్స, నివారణకు సంబంధించిన కొత్త ఉత్పత్తులు అభివృద్ధి చేయడానికి, వాణిజ్యీకరించడానికి తాము చేసుకున్న బహుళ ఒప్పందాలు నిదర్శనమన్నారు. డిమాండ్కు తగిన విధంగా కొన్ని వారాలుగా రెమ్డెసివిర్తో సహా వివిధ ఔషధాల సరఫరా పెంచామన్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సీన్ ద్వారా వ్యాపార అవకాశాలు మెరుగైనట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ తెలిపారు.
రష్యా నుండి దిగుమతులు
రష్యా నుండి దిగుమతుల ద్వారా కొన్ని డోసులు భారత్కు వస్తున్నాయని, ఈ సమయంలో రష్యా కంపెనీ ఆరు దేశీయ తయారీ సంస్థలతో స్థానికంగా ఈ వ్యాక్సీన్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుందన్నారు. బహుశా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. పంపిణీ నెట్ వర్క్ పైన ప్రస్తుతం కంపెనీ పని చేస్తోందన్నారు.
స్పుత్నిక్ వ్యాక్సీన్ సమర్థత
స్పుత్నిక్ వి వ్యాక్సీన్ రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉందని, మెడికల్ జర్నల్ లాన్సెట్లో ప్రచురించిన వ్యాసంలో దీని సమర్థత 91.6 శాతంగా ఉందన్నారు. భారత్లో తొల 25 కోట్ల డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ విక్రయాలకు తమకు హక్కులు ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ సీఈవో తెలిపారు. అన్నీ అనుకూలిస్తే పన్నెండు నెలల్లో ఈ డోసులను సరఫరా చేస్తామన్నారు.