త్వరలో రోజువారీ సవరణ: పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎందుకంటే?
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా గత కొద్ది రోజులుగా దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా సమీక్షించలేదు. ఇప్పటి వరకు ఇంధన సంస్థలు దీనిని పక్కన పెట్టాయి. లాక్ డౌన్ నిబంధనలు క్రమంగా సడలిస్తుండటం, ప్రజలు రోడ్ల పైకి వస్తుండటం, డిమాండ్ పెరుగుతుండటంతో చమురు రంగ సంస్థలు త్వరలో తిరిగి ధరల రోజువారీ సవరణను ప్రారంభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత లేదా మరిన్ని వెసులుబాట్లు ప్రకటించాక ఇది ప్రారంభం కానుంది.
ఏమిటీ గోల్డ్ బాండ్స్: ఎలా కొనుగోలు చేయాలి, వడ్డీ ఎంత.. ప్రయోజనాలెన్నో
లాక్ డౌన్ ఎత్తివేశాక రోజువారీ ధరల సవరణ
కరోనా లాక్ డౌన్కు ముందు నుండి.. మార్చి 16వ తేదీ నుండే పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. ప్రతిరోజు ఉదయం గం.6కు ఇంధన రేట్లను సవరిస్తాయి. దీనిని తాత్కాలికంగా నిలిపివేయాలని అప్పుడే నిర్ణయించాయి. అది కొనసాగుతోంది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేశాక లేక ఆంక్షలు మరిన్ని సడలించాక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నెల చివరలో రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను పునఃప్రారంభించవచ్చును. రోజువారీ సవరణలకు సంబంధించి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. కానీ లాక్ డౌన్ ఎత్తివేశాక సమీక్ష ఉంటుందని భావిస్తున్నారు.
భారీగా పడిపోయిన చమురు ధర
రోజువారీ సవరణ ప్రక్రియ ప్రారంభమైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గత నెల రోజుల్లో 50% వరకు పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర దాదాపు 30 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఈ క్యాలెండర్ ఇయర్ మొదటి నుండి చూస్తే చమురు ధరలు దాదాపు 50% నుండి 60% శాతం పడిపోయాయి.
ఎంత పెరగొచ్చంటే
రోజువారీ ధరల సవరణ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైన తర్వాత కొంత కాలంపాటు పెట్రోల్, డీజిల్ ధరలను ఓ స్థాయిని మించి పెంచేందుకు ప్రభుత్వం అనుమతించకపోవచ్చు. ధరకు, అమ్మకానికి మధ్య ఉన్న లోటును చమురు మార్కెటింగ్ సంస్థలు తొలిగించగలిగే వరకు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల రోజుకు 30 పైసల నుంచి 50 పైసలు లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది.
ధరల్లో మార్పు ఇలా..
అంతర్జాతీయ చమురు ధరను అనుసరించి రిటైల్ ధరల్లో మార్పు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి గత నెల రోజుల్లో చమురు ధరలు 50% వరకు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 20 డాలర్ల కంటే కిందకు పడిపోయి, ఇప్పుడు 30 డాలర్లు పలుకుతోంది. లాక్ డౌన్ కూడా చమురు డిమాండును భారీగా తగ్గించింది. పెట్రోల్ ధరలు ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాదులో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ.73.97, డీజిల్ రూ.67.82, అమరావతిలో పెట్రోల్ రూ.74.61, డీజిల్ రూ.68.52 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.71.26, డీజిల్ రూ.69.39, ముంబైలో పెట్రోల్ రూ.76.31, డీజిల్ రూ.66.21 ఉంది.