Lido Learning: Paytm విజయ్ శేఖర్ శర్మకు భారీ నష్టం.. దివాలా తీసిన ఎడ్-టెక్ స్టార్టప్..
Lido Learning: పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పెట్టుబడి పెట్టిన ఎడ్-టెక్ స్టార్టప్ కంపెనీ లిడో లెర్నింగ్ దివాలా తీసింది. ఈ స్టార్టప్ లో Shaadi.com వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా ఇందులో డబ్బు ఇన్వెస్ట్ చేశారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్లో కంపెనీ గురువారం దివాలా కోసం దాఖలు చేసింది.
ఇన్వెస్టర్ల అంగీకారంతో..
లిడో లెర్నింగ్ తన వాటాదారుల నుంచి సెప్టెంబర్ 5న మెజారిటీ పొందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ కార్యకలాపాలను మూసివేసింది. కరోనా సమయంలో ఎడ్-టెక్ కంపెనీలు ఊపందుకున్నప్పటికీ అనతి కాలంలో నష్టాలపాలయ్యాయి. ఏడు నెలల క్రితం 1200 మందిని కంపెనీ తొలగించింది.
కరోనా తర్వాత తొలగింపులు..
కరోనా మహమ్మారి తర్వాత స్కూల్స్, విద్యాసంస్థలు తెరుచుకోవటంతో వ్యాపారం కోసం ఎడ్-టెక్ స్టార్టప్లు భారీగా నిధులను ఖర్చుచేశాయి. ఈ క్రమంలో భారీ తొలగింపులు తప్పలేదు. ఈ క్రమంలో Unacademy, Vedantu, BYJU'S యాజమాన్యంలోని WhiteHat Jr వంటి Ed-tech సంస్థలు కూడా 2022లో తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది మెుత్తం 11,000 మందికి పైగా ఉద్యోగులను ఎడ్-టెక్ స్టార్టప్ కంపెనీలు తొలగించాయి.
తగ్గిన పెట్టుబడులు..
భారతీయ ఎడ్-టెక్ సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం 733 మిలియన్ డాలర్లను మాత్రమే సేకరించగలిగాయి. గత ఏడాది ఇదే కాలంలో సేకరించిన 1.92 బిలియన్ డాలర్ల కంటే 61 శాతం నిధుల లభ్యత తగ్గింది.
ట్యూషన్స్ కంపెనీ క్లోజ్..
కిండర్ గార్టెన్ నుంచి 12 వరకు గ్రేడ్ వరకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ & కోడింగ్ కోసం చిన్న సమూహ ట్యూషన్ను అందించే లిడో లెర్నింగ్ లో రోనీ స్క్రూవాలా పెట్టుబడులను పెట్టారు. రోనీ స్క్రూవాలా అప్గ్రాడ్, ఎంగురు వంటి ఎడ్-టెక్ సంస్థలకు కూడా మద్దతు ఇచ్చారు.