new IT rules: ట్విట్టర్కు పార్లమెంటరీ కమిటీ సమన్లు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఐటీ నిబంధనల అమలుపై సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్కు సమన్లు జారీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వీటిని జారీ చేసింది. పార్లమెంట్ కాంప్లెక్స్లో జూన్ 18న జరిగే విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తా సమాచార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలనే అంశంపై ట్విట్టర్ ప్రతినిధులు ప్రణాళికలతో రావాలని సూచించింది.
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకొని డిజిటల్ స్పేస్లో మహిళల భద్రతకు రక్షణ కల్పించే అంశంపై ట్విటర్ ప్రతినిధి ఉద్దేశాలను తెలుసుకుంటామని పార్లమెంటరీ కమిటీ అజెండా పేర్కొంది. కొత్త ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని కేంద్రం ట్విటర్కు కొన్నాళ్ల క్రితం తుది నోటీసులిచ్చింది. వీటిని అమలు చేయకుంటే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
నిబంధనల అమలులో ట్విట్టర్ తీరు సరిగ్గాలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పేర్కొంది. గడువులోగా నిబంధనలు పాటించడంలో అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ భారత్ చట్టాల అమలుకు కట్టుడి ఉన్నామని, ప్రభుత్వం నిబంధనలు అమలు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపింది.