పరాగ్ అగర్వాల్ను ట్విట్టర్ నుండి తొలగిస్తే భారీగా చెల్లించాల్సిందే!
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. ఒక్కో షేర్కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్ల మేర ఒప్పందానికి బోర్డు ఆమోదం తెలిపింది. వాటాదారులతో మస్క్ సంప్రదింపులు జరపడంతో ట్విట్టర్ బోర్డు విక్రయానికి మొగ్గు చూపింది. ట్విట్టర్ టేకోవర్కు ఆరు నెలల సమయం పడుతుందని సంస్థ చైర్మన్ బ్రెట్ టేలర్, సీఈవో పరాగ్ అగర్వాల్ తెలిపారు. ట్విట్టర్ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోందని, మున్ముందు సోషళ్ మీడియా సంస్థ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడం ఖాయమని పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పరాగ్ను తొలగిస్తే...
టెస్లా సీఈవో పరాగ్ అగర్వాల్ను ఆ పదవి నుండి తప్పించాలని ఎలాన్ మస్క్ భావిస్తే కనుక ఈ ఇండియన్ ఆరిజిన్ సీఈవోకు 42 మిలియన్ డాలర్లు చెల్లించవలసి ఉంటుంది. ఈ రీసెర్చ్ ఫర్మ్ ప్రకారం అతనిని సీఈవోగా కంపెనీ అపాయింట్ చేసిన తర్వాత 12 నెలల్లో తొలగిస్తే కనుక 42 మిలియన్ డాలర్లు చెల్లించాలని తెలుస్తోంది. అగర్వాల్ నవంబర్ 2021లో ట్విట్టర్ పగ్గాలు చేపట్టారు.
ఆమె అసంతృప్తి
ట్విట్టర్కు పరాగ్ అగర్వాల్ సీఈవోగా ఉండగా, మరో భారత సంతతి కూడా ఉన్నత ఉద్యోగిగా ఉన్నారు. పాలసీ మేకర్గా, న్యాయ సలహాదారుగా ఉన్నారు విజయ గద్దె. ట్విట్టర్లో పోస్టింగుల సెన్సార్షిప్ పైన ఆమె పని చేస్తున్నారు. ద్వేషపూరిత ట్వీట్స్ చేసినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పైన ట్విట్టర్ నిషేధం విధించడంలో ఈమె కీలకం. అయితే ట్వీట్స్ సెన్సార్ షిప్పై మస్క్ విబేధిస్తున్నారు. అయితే ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేయడంపై విజయ గద్దె అసంతృప్తితో ఉన్నారు.
టెస్లాపై ప్రభావం
ఇదిలా ఉండగా, ట్విట్టర్ కొనుగోలు వేపథ్యంలో టెస్లా షేర్ల వ్యాల్యూ అమెరికా ఎక్స్చేంజీల్లో క్రితం సెషన్లో ఏకంగా 12 శాతం పడిపోయాయి. ట్విట్టర్ కొనుగోలుకు నిధులు సమకూర్చేందుకు టెస్లాలో తనకు ఉన్న వాటాలను మస్క్ విక్రయిస్తారనే ప్రచారం సాగింది. అవసరమైతే అమ్మేస్తారనే ప్రచారం కూడా సాగింది.
దీంతో టెస్లా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో టెస్లా మార్కెట్ వ్యాల్యూ 275 బిలియన్ డాలర్లు క్షీణించింది. టెస్లా షేర్ వారం క్రితం 1100 డాలర్లకు సమీపంలో ఉంది, ఇప్పుడు 881 డాలర్లకు పడిపోయింది. నేడు కాస్త కోలుకున్నప్పటికీ కేవలం 0.5 శాతం మాత్రమే లాభపడింది.