పాన్-ఆధార్ లింకింగ్ గడువు మరోసారి పొడిగింపు, ఎప్పటి వరకు అంటే?
కేంద్ర ఆర్థిక శాఖ పాన్ కార్డు నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకునే గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకు గడువు ఈ రోజుతో (మార్చి 31)తో ముగుస్తోంది. అయితే కేంద్రం తాజాగా ఈ గడువును మార్చి 31, 2021 వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారికి ఇది పెద్ద ఊరట. కొంతమంది వద్ద ఒకటి కన్న ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయి. ఎవరైనా రెండు పాన్ కార్డులు ఉపయోగిస్తే వాటిలో ఒకదానిని ఇన్-ఆపరేటివ్ చేసుకోవాలి. ఒక దానిని ఉపయోగించాలి.
జరిమానా నుండి ఊరట
ఇదివరకు గడువు అయితే పాన్-ఆధార్ లింక్ గడువు నేటితో ముగియాలి. ఆ తర్వాత రూ.500-రూ.1000 వరకు జరిమానా ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 30 వరకు అనుసంధానం చేస్తే రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ.1000 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. మార్చి 31 తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ ఇన్-యాక్టివేట్గా మారుతాయని పేర్కొంది. పైన పేర్కొన్న జరిమానాను చెల్లించి అనుసంధానం చేస్తే తిరిగి పని చేస్తాయని తెలిపింది. కానీ ఈ జరిమానాలు అన్నింటి నుండి ఊరట కలిగించేలా తాజా ప్రకటన వచ్చింది. లింకింగ్ గడువును మరో ఏడాది పొడిగించారు.
ఇలా లింక్
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్లి, రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబర్ మీ యూజర్ ఐడీ అవుతుంది. యూజర్ ఐడీ, పాస్ వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగ్-ఇన్ కావాలి. ఆధార్-పాన్ లింక్ కోసం ఓ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం కనిపిస్తుంది. స్క్రీన్ పైన పాన్ కార్డు వివరాలను ఆధార్లో పేర్కొన్న వివరాలతో ధృవీకరించాలి. (ఏవైనా తేడాలు ఉంటే సరి చేసుకోవాలి.) ఆ తర్వాత వివరాలు సరిపోతే మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి లింక్ నౌ పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్, పాన్ కార్డుతో విజయవంతంగా లింక్ అయినట్లు పాప్-ఆప్ విండోతో సందేశం వస్తుంది. ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో కనిపిస్తున్న లింక్ ఆధార్ పైన క్లిక్ చేసి, అనుసంధానం చేసుకోవచ్చు.
ఈ సేవలు పొందాలంటే
బ్యాంకింగ్ సేవలు పొందడం కోసం, డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందడానికి మీ పాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. లేదంటే ఈ సేవలకు ఇబ్బందులు కలగవచ్చు. దీంతో పాటు మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి వచ్చే వడ్డీ, డివిడెండ్, ఇతర ఆదాయాలపై అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశముంది.