ఓయోలో ఏం జరుగుతోంది? ఫోన్లు ఎత్తని స్టాఫ్, ఆందోళనలో హోటల్ యజమానులు!
ఎరక్కపోయి ఇరుక్కోవటం అనే సామెత ఇప్పుడు ఓయో రూమ్స్ కు హోటల్స్ ఇచ్చిన యజమానులకు సరిగ్గా సరిపోతుంది. కొన్నేళ్ల క్రితం ఓయో రూమ్స్ ప్రారంభించిన కొత్తలో హోటల్స్ ఖాళీగా పెట్టుకునే బదులు, నెల నెల తప్పనిసరి రెంట్ వస్తుంది కదా అని ఆశపడి, హోటల్ యజమానులు ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్నాళ్ళు బాగానే బిజినెస్ నడిచింది. కానీ గత ఐదారు నెలల నుంచి ఓయో తీరుపై హోటల్ జయమానులు మండిపడుతున్నారు. అగ్రీమెంట్లో ఉన్న తీరుగా చెల్లింపులు చేయకపోగా... సరైన సమాచారం కూడా అందించటం లేదని ఆరోపిస్తున్నారు.
ఈ మధ్య ఓయో రూమ్స్ చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో హోటల్స్ యజమానుల ఆందోళన మరింత అధికమైంది. పరిస్థితి గురించి తెలుసుకుందామని ఓయో ఉద్యోగులను సంప్రదిస్తుంటే... వారు ఫోన్లు కూడా ఎత్తడం లేదట. దీంతో ఓయో లో అసలు ఏం జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలే ఉద్యోగులు చాలా తొందరగా మారిపోతుంటారు. ఇక ఉన్న వారిని సంప్రదిస్తుంటే వారు కూడా స్పందించక పోతే తమ పరిస్థితి ఏమిటా అని భయపడుతున్నారు.
ఉద్యోగుల కంటే హీనం...
ఓయో తో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు నవీకరణ, అలంకరణ కోసం రూ లక్షల్లో ఖర్చు చేశాం. తీరా అగ్రీమెంట్లు కుదుర్చుకున్న తర్వాత మమ్మల్ని పార్టనర్ గా చూడటం లేదు. ఒక ఉద్యోగి కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం చెల్లింపులు లేవు. అదేమని అడుగుదామంటే ఎవరూ అందుబాటులో ఉండరు. పోనీ ఓయో నుంచి బయటకు వద్దామంటే... సోల్డ్ అవుట్ అనే బోర్డు పెడతారు. కాబట్టి మా రెగ్యులర్ కస్టమర్లు కూడా రారు. ఇటీవల కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను మానేయమని అడుగుతోంది. కానీ ఆ విషయం మాతో మాత్రం చెప్పటం లేదు. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. ఇదీ ఓయో పై హోటల్ యజమానులు ఆక్రోశం. ముంబై, బెంగళూరు, పూణే నగరాల్లో ఓయో తో కలిసి పనిచేస్తున్న కొందరు హోటల్ యజమానులతో మాట్లాడి ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. అందులో ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
వేల మంది అవుట్...
దేశవ్యాప్తంగా ఓయో రూమ్స్ లో సుమారు 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల అందులో నుంచి సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగపోవటంతో ఓయో తీవ్ర నష్టాల్లో ఉంది. కంపెనీ వాల్యుయేషన్ కేవలం యూసర్ బేస్ ఆధారంగా, హోటల్ రూమ్స్ ఆధారంగా పెరుగుతోంది కానీ, అనుకున్న స్థాయిలో ఆదాయం లేదు. ఇటీవల ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి రాక కూడా తగ్గిపోయింది. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కంపెనీ సమయానికి హోటల్ యజమానులకు చెల్లింపులు చేయటం లేదని తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగుల పై విపరీతమైన పని ఒత్తిడి ఉండటంతో అట్రిషన్ రేటు అధికంగా ఉంటోందని సమాచారం. దీంతో కొంత మంది స్వతహాగా వెళ్లిపోతుంటే.. ఇంకొంత మందిని ఓయో నే స్వయంగా ఇంటికి పంపుతోంది.
లాభాల కోసం ...
దేశంలో ఉన్న చాలా ప్రాపర్టీస్ లో ఓయో రూమ్స్ కు నష్టాలే వస్తున్నాయి. అందుకే, వాటిని పునర్ వ్యవస్థీకరించి లాభాల బాట పట్టించాలని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు పలు వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే, ఈ ప్రాసెస్ లో కంపెనీ చాలా ఇబ్బంది పడుతూ, హోటల్ యజమానులను సైతం ఇబ్బంది పెడుతోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే, తమపై వచ్చిన అన్ని రకాల ఆరోపణలను ఓయో కొట్టి పడేస్తోంది. తమను సంప్రదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, తమ భాగస్వాములతో నిరంతరంగా కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చింది. లాభాలతో పాటు నిలకడైన వ్యాపారానికి బాటలు వేస్తున్నామని, వినియోగదారులకు అధిక సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రాగాలు తీస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా... మరి కొన్ని రోజుల్లో ఓయో లో ఏదో జరగబోతోందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.