బ్యాడ్ న్యూస్: ఓయోలో ఉద్యోగాల కోత... సుమారు 2000 మందికి గుడ్ బై!
ఓయో రూమ్స్. ఆన్లైన్ లో హోటల్ గదులు బుక్ చేసుకునే కంపెనీ. ఈ జనరేషన్ కు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఇండియా నుంచి విదేశాలకు విస్తరించిన అతి కొద్ది విజవంతమైన స్టార్టుప్ కంపెనీల్లో ఒకటి. సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 70,000 కోట్లు) విలువైన ఈ కంపెనీ పై అనేక నెగటివ్ వార్తలు వస్తున్నాయి. జపాన్ కుబేరుడు మసాయాషి సొన్ ఓయో లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అమెరికా సహా చైనా వంటి పెద్ద పెద్ద మార్కెట్లలోనూ ఓయో తన సేవలు అందిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో 10,00,000 కు పైగా హోటల్ గదులను నిర్వహిస్తోంది. కానీ అంతకంతకూ నష్టాలు పెరిగిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే నష్టాలు తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. ఇప్పటికే ఇండియా - చైనా లో కలిపి దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించిన ఓయో... మరో 1,000 నుంచి 2,000 వరకు తగ్గించే క్రమంలో ఉన్నట్లు ప్రముఖ వార్తా ఏజెన్సీ బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇండియా - చైనా మార్కెట్ల లో ఓయో రూమ్స్ పునర్ వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వేలాదిగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది.
ఉద్యోగాల కోతకు సంబంధించిన మరిన్ని వార్తలు
పనితీరు వల్లే...
ఓయో రూమ్స్ కు ఇండియా లో సుమారు 10,000 ఉద్యోగులు ఉన్నారు. ఇందులో దాదాపు 12% మందిని తొలగించింది. అదే సమయంలో చైనా లో ఓయో కు 12,000 మంది ఉద్యోగులున్నారు. అందులో నుంచి 5% ఉద్యోగులను తొలగించింది. మరో రెండు మూడు నెలల కాలంలో ఇండియా లో మరో 1,200 మందికి ఉద్వాసన పలకాలని ఓయో భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. కాగా ఓయో మాత్రం దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యుత్తమ ప్రమాణాల ప్రకారం ఉద్యోగుల పనితీరును బేరీజు వేసి వారికి రివార్డులు, గుర్తింపు అందించే ప్రక్రియలో భాగంగానే ఇలాంటి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ఓయో స్పష్టం చేసింది. అదే సమయంలో ఎప్పటికీ పని చేయటానికి అత్యుత్తమ ప్రదేశాల్లో ఒకటిగా ఓయో ఉండేందుకు ప్రయత్నిస్తుంటామని పేర్కొంది.
సాఫ్ట్ బ్యాంకు కు షాక్...
జపాన్ ఇన్వెస్టర్, సాఫ్ట్ బ్యాంకు ఫౌండర్ ఐన మసాయాషి సొన్ కు ఇప్పటికే ఒక పెద్ద దెబ్బ తగిలింది. స్టార్టుప్ కంపెనీలకు ఆఫీస్ స్థలాన్ని అద్దెకిచ్చే వి వర్క్ అనే అమెరికా స్టార్టుప్ కంపెనీ లో ఇటీవల లొసుగులు బయటపడ్డాయి. వి వర్క్ లో సాఫ్ట్ బ్యాంకే అతి పెద్ద ఇన్వెస్టర్ గా ఉంది. కంపెనీలో అవకతవకలు వెల్లడి కావటంతో ఒక్కసారిగా 48 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న వి వర్క్ ... కేవలం 8 బిలియన్ డాలర్ల కు పడిపోయింది. అదే సమయంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ను కూడా అర్ధాంతరంగా నిలిపివేశారు. వి వర్క్ ఫౌండర్ కు కంపెనీ నుంచి ఉద్వాసన పలికారు. ఇప్పుడు అదే దారిలో ఓయో పయనిస్తోందా అన్న అనుమానాలు అనలిస్టులను వెంటాడుతున్నాయి. కార్యకలాపాలు పెరిగితే నష్టాలూ పెరిగిపోతుండటం ... కొంత కాలానికి కంపెనీ నడపటమే కష్టమవుతుండటం ఓయో ఇన్వెస్టర్ల ను ఆందోళనకు గురిచేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓయో కూడా వి వర్క్ దారిలో పయనిస్తే... ఇక సాఫ్ట్ బ్యాంకు కు మరో అతిపెద్ద షాక్ తప్పదని భావిస్తున్నారు. ఓయో లో సాఫ్ట్ బ్యాంకు ఇప్పటి వరకు 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ 10,500 కోట్లు) పెట్టుబడి పెట్టింది.
చైనా లో నిరసనలు...
ఓయో కు చైనా లో నిరసనల సెగ మొదలైంది. దీనికి హోటల్స్ ను అద్దెకు ఇచ్చిన ఓనర్లు తమకు కాంట్రాక్టులో పేర్కొన్న విధంగా రెంటల్స్ చెల్లించటం లేదని ఓయో కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. ఇది ఓయోను, దాని ఇన్వెస్టర్ ఐన సాఫ్ట్ బ్యాంకు ను ఇరకాటంలో పడేసే అంశమే. ఇండియా లోనూ వందల సంఖ్యలో ఓయో తో పనిచేస్తున్న హోటల్ ఓనర్స్ కూడా తమకు నిబంధలు ప్రకారం అద్దెలు చెల్లించటం లేదని ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి. వీటిపై మీడియా లో వరుస కథనాలు వస్తున్నాయి. చెల్లింపులు కూడా సమయానుకూలంగా చేయటం లేదని, ఇది కంపెనీ ఆర్థిక పరిస్థితి పై అనుమానాలు పెరిగేందుకు కారణం అవుతోందని అంటున్నారు.