అమ్మో.. అంత పెద్ద ఖర్చులకు దూరం: 2022లో 80% కుటుంబాలది ఇదే దారి
కరోనా... కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఐటీ సంస్థలు సహా వివిధ రంగాల్లోని కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని తొలుత భావించాయి. కానీ ఒమిక్రాన్ కారణంగా దీనిని వాయిదా వేశాయి. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు. కరోనా కేసులు 2021 చివరలో తగ్గాయి. ఒమిక్రాన్ ప్రభావం కూడా అంతంతే అనిపించింది. కానీ ఇప్పుడు ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో దేశంలో 1100 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
కరోనా కారణంగా అనేక కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకొని కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. ఇటీవలే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని, వినిమయం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఒమిక్రాన్ వచ్చి, థర్డ్ వేవ్ భయాలు పెరిగాయి. దీంతో కొత్త ఏడాదిలో కూడా ఆచితూచి ఖర్చు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఖరీదైన వస్తువుల జోలికి వెళ్లలేమని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. 2022 ఏడాదిలో ఆస్తి లేదా కారు వంటి విలువైన వాటిని కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేదని ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు తెలిపాయి. అంటే 80 శాతం కుటుంబాలు పెద్ద ఖర్చులు చేయమని చెప్పింది.
47,000 కుటుంబాలను సర్వే చేశారు. వీరిలో 78 శాతం కుటుంబాలు కొత్త ఏడాదిలో జ్యువెల్లరీ కొనే ఆలోచన లేదని చెప్పారు. పదిహేను శాతం కుటుంబాలు మాత్రం ఇళ్లు, వెహికిల్స్ కొనుగోలు చేస్తామని చెప్పాయి. ఆరు శాతం కుటుంబాలు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏడు శాతం మంది పెట్రోల్ కారు, మూడు శాతం మంది డీజిల్ కారుకు మొగ్గు చూపారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే రిస్క్కు మొగ్గు చూపారు. సాధారణంగా బంగారం, సేవింగ్స్ డిపాజిట్స్ను సురక్షిత పెట్టుబడిగా పేర్కొంటారు. కానీ వీటి వైపు మొగ్గు చూపకుండా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తామన్నారు. ఇవి రిస్క్తో కూడుకున్నవి. ఇక హెల్త్ కవరేజీని కొనసాగిస్తామని చెప్పారు. పదిహేను శాతం మంది మాత్రం బీమా కవరేజీని పెంచుతామన్నారు.