పండుగ సమయంలో షాక్: ఉల్లి, ఆలు ధరలు ఆకాశానికి, దీపావళి నాటికి అది తగ్గొచ్చు
పండుగ సమయంలో ఉల్లి, ఆలు ధరలు సామాన్యులకు షాకిచ్చాయి. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు రూ.70 నుండి రూ.100కు పెరిగిన విషయం తెలిసిందే. ఆలు ధరలు కూడా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో కిలో రూ.50 నుండి రూ.60 తాకింది. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టం కారణంగా మార్కెట్లకు ఉల్లి, ఆలు రాక తగ్గింది. దీంతో మధ్యవర్తులు ధరలు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉల్లి ఎక్కువగా పండుతుంది. ఇక్కడ వర్షాలు, వరదల కారణంగా నీట తడిచిన ఉల్లి కుల్లిపోయింది. ఉల్లి ధరలు హోల్సేల్ మార్కెట్లోనే రూ.20-రూ.30 నుండి రూ.45-రూ.60కి చేరుకున్నాయి.
ఉల్లి ధరలు భగ్గు, రెండ్రోజుల్లో రూ.60 జంప్: కేంద్రం కీలక నిర్ణయం
ఉల్లి కొరత.. తగ్గిన సరఫరా
అజాద్పుర్ హోల్సేల్ మార్కెట్ వంటి పెద్ద పెద్ద మార్కెట్లలో ఉల్లి కొరత కనిపిస్తోంది. ఇక్కడి హోల్ సేల్ మార్కెట్లో వారం క్రితం రూ.25 నుండి రూ.40 మధ్య ఉన్న ధర ఇప్పుడు రూ.40 నుండి రూ.60కి పెరిగిందని చెబుతున్నారు. పదిరోజుల క్రితం ఆజాద్పూర్ మార్కెట్కు రోజుకు 50 నుండి 60 ట్రక్కుల ఉల్లి రాగా, ఇప్పుడు అది 25 ట్రక్కులకు పరిమితమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో తాజా ఉల్లి సరుకులు మార్కెట్కు వస్తాయని, ఈసారి ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఉల్లి ధర మరింత కాలం అధికంగా. ఆలు ధరలు తగ్గొచ్చు
త్వరలో అల్వార్ నుండి ఉల్లి వచ్చే అవకాశాలు ఉన్నాయని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. కాబట్టి మరికొంతకాలం ఉల్లి ధరలు ఇలాగే అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. పాల్వాల్ నుండి రావాల్సిన ఉల్లి ఆలస్యమైందని, త్వరలో రావొచ్చునని అంటున్నారు. పండుగ సమయంలో ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ.70 నుండి రూ.100కు చేరుకోవడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. ఆలు ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ, పంజాబ్ వంటి పలు ప్రాంతాల నుండి దీపావళి నాటికి సరఫరా పెరిగి, ధరల్లో తగ్గుదల ఉండవచ్చునని అంటున్నారు.
కేంద్రం చర్యలు.. ఏపీ ప్రభుత్వం ఊరట
ఉల్లి కొరత కారణంగా ధరలు పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దిగుతులపై డిసెంబర్ 15వ తేదీ వరకు కొన్ని సడలింపులు ఇచ్చింది. అలాగే, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రైతు బజార్లలో ఉల్లిని కిలో రూ.40కే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో రూ.60 నుండి రూ.100 వరకు ఉన్న ఉల్లి ధర అదుపులోకి వచ్చే వరకు రైతు బజార్లలో సబ్సిడీపై అందించాలని నిన్న ప్రభుత్వం నిర్ణయించింది.