business split: రెండు కంపెనీలుగా IBM, కొత్త సంస్థలోకి 3వ వంతు భారత ఉద్యోగులు
ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పోరేషన్(IBM) 19 బిలియన్ డాలర్ల వ్యాపార కార్యకలాపాలను రెండు పబ్లిక్ కంపెనీలుగా విడదీయాలని నిర్ణయించింది. అధిక మార్జిన్ కలిగిన క్లౌడ్ కంప్యూటింగ్ పైన ప్రత్యేక దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2021 చివరినాటికి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవల విభాగాన్ని కొత్త పేరుతో ప్రత్యేకంగా కంపెనీగా నమోదు చేయనుంది IBM. ఐటీ కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ పైన మరింత దృష్టి సారిస్తోన్న విషయం తెలిసిందే. IBM ఇందుకోసం రెండు పబ్లిక్ కంపెనీలుగా విడిపోనుంది.
నల్లధనంపై పోరులో 'రెండో' అడుగు! భారత్ చేతికి స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు
రెండు యూనిట్లుగా...
మేనేజ్డ్ ఇన్ఫ్రా సేవల విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేస్తోంది IBM. ఇక నుండి IBM పూర్తిగా హైబ్రీడ్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వ్యాపారాలపై దృష్టి సారిస్తుంది. రెండో సంస్థ సర్వీస్ డెలివరీ, ఆటోమేషన్ వంటి విభాగాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం కొత్త యూనిట్ అంతర్జాతీయ టెక్నాలజీ సేవల విభాగంలో ఉంది. దీనికి 115 దేశాల్లో 4,600 మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ విభాగం చేతిలో అరవై బిలియన్ డాలర్ల ఆర్డర్స్ ఉన్నాయి.
విడిపోయాక త్రైమాసిక డివిడెండ్
ఈరోజు కంపెనీకి చారిత్రాత్మక రోజు అని, IBM భవిష్యత్తును పునర్నిర్వచించనున్నామని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ అన్నారు. ఈ కంపెనీకి 109 ఏళ్ల చరిత్ర ఉంది. హైబ్రిడ్ క్లౌడ్ సాఫ్టువేర్, సేవల్లో మరింత ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీకి పేరు పెట్టవలసి ఉంది. కంపెనీ రెండుగా విడిపోయిన తర్వాత ప్రారంభంలో త్రైమాసిక డివిడెండ్ను సంయుక్తంగా చెల్లించే అవకాశాలు ఉన్నాయి.
భారత్లో మూడోవంతు సిబ్బంది కొత్త కంపెనీలోకి
భారత్లోని IBM ఉద్యోగుల్లో మూడోవంతు సిబ్బందిని కొత్త సంస్థలోకి బదలాయించనున్నట్లు అరవింద్ కృష్ణ తెలిపారు. 2019 నాటికి ఐబీఎంలో 3.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మన దేశంలో ఒక లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. అంటే ప్రపంచ వర్క్ ఫోర్స్లో భారత్లో ఉద్యోగులు మూడో వంతు ఉండవచ్చు. ఈ విభజన భారత కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపించదని తెలిపారు. భారత్లో టెలికం, బ్యాంకింగ్, ప్రభుత్వాలు హైబ్రిడ్ క్లౌడ్ దిశగా వెళ్తున్నారన్నారు. కాగా, మూడో క్వార్టర్లో IBM 17.6 బిలియన్ డాలర్ల రెవెన్యూ, షేర్లపై లాభం 2.58 డాలర్లను నమోదు చేయవచ్చునని అంచనాలు ఉన్నాయి. గత ఏడాది IBM వార్షిక ఆదాయం 77.1 బిలియన్ డాలర్లుగా ఉంది.