Omicron outbreak: డబ్ల్యూటీఓ కీలక నిర్ణయం: 4 వేల మంది పాల్గొనాల్సిన భేటీని..
జెనీవా: రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి.. మరోసారి ఈ భూగోళాన్ని కమ్మేయబోతోంది. ఈ తరహా పరిస్థితులు సర్వత్రా క్రమంగా వ్యాపిస్తోన్నాయి. కరోనా వైరస్ మరోమారు కోరలు చాస్తోండటంతో అనేక దేశాలు అప్రమత్తం అయ్యాయి. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నాయి. లాక్డౌన్ తరహా పరిస్థితులకు తెర తీస్తో్నాయి. కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ దేశాలతో వాయు సంబంధాలను తెంచుకుంటోన్నాయి.
ఒమిక్రాన్గా
ఇప్పుడు కొత్త వెలుగులోకి వచ్చిన వేరియంట్ను ఒమిక్రాన్ (Omicron)గా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒమిక్రాన్ అవుట్ బ్రేక్ గురించి చర్చించడానికి శుక్రవారమే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ తొలుత ఆఫ్రికా ఖండంలోని బోట్సువానాలో వెలుగులోకి వచ్చింది. ఆరుమంది ఈ వైరస్ బారిన పడ్డారు. అనంతరం దక్షిణాఫ్రికాలోని గ్వాటెంగ్ ప్రావిన్స్కు వ్యాపించింది.
30 మ్యుటేషన్లతో..
30 మ్యుటేషన్లతో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోన్న ఈ వేరియంట్ను అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించింది డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచ దేశాలన్నింటినీ అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్ మరింత విస్తృతం కాకుండా కఠిన చర్యలను తీసుకోవాలని సూచించింది. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రత్యేకించి- ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే వారు.. స్వదేశీయులైనా సరే- వారిని క్వారంటైన్ చేయాల్సిన అంశాన్ని పరిశీలించాలని తెలిపింది.
నాలుగు వేల మంది పాల్గొనాల్సి ఉన్న భేటీ..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ను వాయిదా వేసింది. ఇన్ పర్సన్ భేటీ ఇది. నాలుగు వేల మంది ప్రతినిధులు, అధికారులు పాల్గొనాల్సి ఉంది. మేధో సంపత్తి హక్కుల మాఫీ సహా అనేక అంశాలు ఈ భేటీ సందర్భంగా చర్చించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అజెండాను రూపొందించుకుంది.
ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్..
ఒమిక్రాన్ కరోనా వైరస్ వేరియంట్ అవుట్ బ్రేక్ కావడంతో దీన్ని వాయిదా వేసింది. ఒమిక్రాన్ అవుట్ బ్రేక్ వల్ల స్విట్జర్లాండ్.. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలను కఠినతరం చేసింది. పలు ఆంక్షలను విధించింది. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- డబ్ల్యూటీఓ ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ను వాయిదా వేసింది. త్వరలోనే దీన్ని నిర్వహిస్తామని, దీనికి పరిస్థితులు అనుకూలించాల్సి ఉందని తెలిపింది.
వర్చువల్ భేటీకి
ఈ ఆంక్షలు సుదీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి వస్తే వర్చువల్గా చేపట్టే విషయాన్ని పరిశీలిస్తామని డబ్ల్యూటీఓ జనరల్ కౌన్సిల్ చీఫ్ డేసియో క్యాస్టిల్లో తెలిపారు. ఒమిక్రాన్ అవుట్ బ్రేక్ కావడంతో నాలుగు వేల మంది పాల్గొనాల్సిన ఈ భేటీని వాయిదా వేసినట్లు డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకొన్జో-ఇవీలియా తెలిపారు. ఆఫ్రికా దక్షిణ ప్రాంత దేశాల నుంచి వచ్చే విమానాలన్నింటినీ స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసుకుందనే విషయాన్ని గుర్తు చేశారు.