Ola: ఆ వ్యాపారాలను బంద్ చేస్తున్న ఓలా.. 50 కోట్ల మంది భారతీయుల కోసం..
Ola Dash: ఓలా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్లోని కొన్ని వ్యాపారాలను మూసివేసేందుకు సిద్ధమైంది. దేశంలో కంపెనీకి ఉన్న పాత కార్ల విక్రయ వ్యాపారంతో పాటు Ola Dash పేరుతో నిర్వహిస్తున్న గ్రోసరీ డెలివరీ వ్యాపారాలను మూసివేయనుంది. దీనకి సంబంధించిన వివరాలను కంపెనీ వెలువరించింది. ఓలా ఎలక్ట్రిక్ కోసం మార్కెట్ స్ట్రాటజీని బలోపేతం చేయడంపై మరింత దృష్టి పెట్టేందుకు ఓలా తమ కార్ల వ్యాపారాన్ని తిరిగి మార్చనున్నట్లు సంస్థ తెలిపింది.ఓలా కార్ల ఇన్ఫ్రా, సాంకేతికత, సామర్థ్యాలను ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ కోసం ఉపయోగిస్తామని వారు తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ కార్లు, సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కొత్త రంగాల్లోకి తన పెట్టుబడుల వేగాన్ని పెంచటం ద్వారా గ్రోత్ సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక లక్ష్యాలు.. కొత్త వాహనాలు..
Ola Electric FY22-23 మొదటి రెండు నెలల్లో రూ.500 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది. ఈ ఏడాది చివరి నాటికి బిలియన్ డాలర్ల రన్ రేట్ను అధిగమించే దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా.. Ola తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పోర్ట్ఫోలియోను కూడా విస్తరింపజేస్తోంది. ఈ సంవత్సరం చివరిలోపు మాస్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని తన రెండవ EV స్కూటర్ను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.భారత్ లో విద్యుత్ విప్లవాన్ని వేగవంతం చేయడం, 50 కోట్ల భారతీయులకు సేవలందించేలా తన మొబిలిటీ సేవలను స్కేల్ చేసేందుకు ఓలా దృష్టి సారించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆపరేషన్లు బంద్..
నాగ్పూర్, విశాఖపట్నం, లూథియానా, పాట్నా, గౌహతిల్లో ఓలా కార్లు తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఓలా కార్లు అక్టోబర్ 2021లో 30 నగరాల్లో ప్రారంభించబడ్డాయి. 2022 నాటికి 100 నగరాలకు పైగా విస్తరించాలని యోచిస్తోంది. అయినప్పటికీ.. కార్యాచరణ నగరాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఓలా కార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ సిర్దేశ్ముఖ్ కూడా మే 2022లో కంపెనీని వీడారు. గ్రోసరీ డెలివరీ వ్యాపారాన్ని 500 డార్క్ స్టోర్ల ద్వారా 20 నగరాల్లో విస్తరించాలని యోచించింది. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో కార్మికులను తొలిగించినట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు..
ఓలా ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలో 1,441 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కంపెనీ రీకాల్ చేయాల్సి వచ్చింది. కంపెనీ 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడంపై R&D చేస్తోంది. ఓలా కారును ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను నిర్మించడమే తమ సంస్థ లక్ష్యమని వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ అన్నారు. ఇటీవలి కాలంలో టాటా నెక్సన్ ఈవీ మంటల్లో చిక్కుకున్న వీడియోపై అగ్ని ప్రమాదాలు జరగటం సాధారణమే అంటూ భవిష్ అగర్వాల్ చేసిన కామెంట్స్ కొంత వివాదాస్పదమయ్యాయి.