డ్రైవర్లను ఆదుకునేందుకు ఓలా ‘డ్రైవ్ ది డ్రైవర్’ ఫండ్!
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ లాక్డౌన్ పాటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఎదురయ్యే కష్టాల నుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా' నడుం బిగించింది.
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆదాయం లేక ఇబ్బంది పడుతోన్న లక్షలాది మంది డ్రైవర్లను ఆదుకునేందుకు 'డ్రైవ్ ది డ్రైవర్' పేరుతో రూ.20 కోట్లతో ఒక ఫండ్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు.

అంతేకాదు, తాను తన ఏడాది జీతాన్ని ఈ ఫండ్కు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా మొత్తం రూ.50 కోట్లు సేకరించాలని తమ కంపెనీ ప్రయత్నిస్తోందని, దాతలు ఎవరైనా, ఎంతైనా ఈ ఫండ్కు విరాళం ఇవ్వవొచ్చని భవీష్ అగర్వాల్ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల క్యాబ్లను కలిగి ఉన్న 'ఓలా' తన అనుబంధ సంస్థ 'ఫ్లీట్ టెక్నాలజీస్' డ్రైవర్ల లీజ్ రెంట్లను, ఈఎంఐలను కూడా మాఫీ చేసింది. సాయం చిన్నదైనా అది లక్షలాది డ్రైవర్ల కుటుంబాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ 'డ్రైవ్ ది డ్రైవర్' ఫండ్కు విరాళాలు పంపి తమ వంతు సహాయం చేయాలని తన ట్వీట్లో భవీష్ అగర్వాల్ కోరారు.
ఈ సంక్షోభ సమయంలో తమ డ్రైవర్ల కుటుంబాలకు అవసరమైన అత్యవసర సామగ్రి కొనుగోలుకు, వారికి ఉచిత వైద్యం, డ్రైవర్ల పిల్లల విద్యకు ఆర్థిక సాయం అందించడం తదితర సేవలు అందించే విషయమై దృష్టి సారించినట్లు ఓలా కమ్యూనికేషన్స్ హెడ్ ఆనంద్ సుబ్రమణియన్ తెలిపారు.
ఓలాకు డ్రైవర్లే వెన్నెముక అని, అలాంటి తమ డ్రైవర్లు ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవాలనే లక్ష్యంతోనే తమ సంస్థ ఈ మేరకు నిధిని ప్రారంభించిందని, డ్రైవర్ల కుటుంబాలకు తక్షణ సాయం అందించడానికి ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications