OLA CEO: ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రమాదాలు సాధారణమే.. ఓలా సీఈవో ట్వీట్.. తప్పుపడుతున్న నెటిజన్లు..
Electric Vehicles Fire: దేశంలోని అనేక కంపెనీలు తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో వరుస అగ్ని ప్రమాదాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే క్రమంలో ఓలా కంపెనీ తయారు చేసిన వాహనాల్లోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. ఇదే తరుణంలో గతంలోనూ కంపెనీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇదే తరుణంలో కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ఒక ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రమాదాలు సర్వసాధారణమేనని, అనేక అంతర్జాతీయ కంపెనీలు తయారు చేసిన వాహనాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని తన ట్వీట్ లో తెలిపారు. ఇలాంటి ఘటనలు సాధారణమేనన్న రీతిలో ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు.

టాటా నెక్సన్ ఈవీలో అగ్ని ప్రమాదం..
నిన్న ముంబై నగర శివారులో టాటా గ్రూప్ తయారుచేసిన టాటా నెక్సన్ ఈవీ కారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సకాలంలో మంటలను ఆర్పినప్పటికీ.. ఈ ఘటన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట్లో పోస్ట్ చేయగా దానిపై టాటా కంపెనీ స్పందించింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రమాదానికి వెనుక కారణాలను కనుగొని వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తామని బదులిచ్చింది టాటా మోటార్స్.
ఓలా సీఈవో ట్వీట్..
ఈ వీడియోపై స్పందిస్తూ.. ఓలా సీఈవో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనని అన్నారు. ఎలక్ట్రిక్ వాహానాల్లో ప్రమాదాలు చాలా అరుదుగా, చాలా తక్కువ సంఖ్యలో జరుగుతుంటాయని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అసలు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలా వద్దా అనే ఆందోళన, గందరగోళంలో వాహనదారులు ఉన్న క్రమంలో ఇలాంటి ట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ కు మద్దతిస్తున్నవారితో పాటు విమర్శలు చేస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. ఏదేమైనా ప్రమాదాలను వీలైనంత వరకు జరగకుండా ఉండేలా తయారీ సంస్థలు నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనేక మంది వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications