చైనాకు మరో షాక్, కీలక నిర్ణయం తీసుకున్న చమురు కంపెనీలు
గాల్వాన్ లోయలో చైనా దుందుడుకు చర్యలతో డ్రాగన్ దేశానికి చెందిన ఉత్పత్తులపై ప్రజల ఆగ్రహం, భద్రతా కారణాలతో ప్రభుత్వం యాప్స్ నిషేధం వంటి కీలక నిర్ణయాలు తెలిసిందే. ఆటో పరిశ్రమ మొదలు వివిధ రంగాలు సాధ్యమైనంత మేర చైనీస్ ఉత్పత్తులను తగ్గించాలని భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
బంగారం, చమురు ఎఫెక్ట్: భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్న్యూస్, చెల్లింపుల ఖాతా భారం తగ్గుతోంది!
చార్టరింగ్ ట్యాంకర్లకు చెక్
చైనా కంపెనీలకు చెందిన లేదా ఆపరేట్ చేస్తున్న చార్టరింగ్ ట్యాంకర్లను నిలిపివేయాలని, ఒకవేళ ఆ షిప్స్ థర్డ్ పార్టీకి చెందినవి అయినా నివారించాలని ప్రభుత్వరంగ చమురు కంపెనీలు నిర్ణయించాయి. లడక్లో చైనా సైన్యం సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడి, ఇరవై మంది భారత జవాన్లను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సెక్యూరిటీ కారణాలతో ప్రభుత్వం యాప్స్ను నిషేధించింది. భారత ప్రజలు కూడా ఎక్కువగా చైనా ఉత్పత్తులను తగ్గించారు.
బిడ్డింగ్స్కు నో ఆహ్వానం
సాధారణంగా చమురు కంపెనీలు తమ గ్లోబల్ టెండర్స్లో భారత్కు చెందిన షిప్స్కు మొదటి ప్రాధాన్యతను ఇస్తాయి. అంతర్జాతీయ టెండర్స్ సమయంలోను భారత్ షిప్స్కు అనుకూలంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిబంధన ప్రకారం విదేశీ షిప్స్ బిడ్స్ గెలుచుకున్నప్పటికీ.. బిడ్కు దాదాపు దగ్గరగా ఉండే భారత ట్యాంకర్లకు కాంట్రాక్టులు ఇవ్వవచ్చు. ప్రస్తుత నిర్ణయం చైనా ఓడలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. పరిమిత టెండర్ల కోసం కంపెనీలు గతంలో నమోదు చేసుకున్న చైనీస్ షిప్పింగ్ సంస్థలను కూడా బడ్డింగ్స్కు ఆహ్వానించకుండా ఉండవచ్చు.
ప్రభావం తక్కువే.. ట్రేడర్స్, సప్లయర్స్కు విజ్ఞప్తి
అయితే చమురు చార్టర్డ్ నౌకల సంఖ్యపరంగా చైనా ఓడలు తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ నిషేధ నిర్ణయం చమురు కంపెనీల వాణిజ్యంపై పెద్దగా ప్రభావం చూపించదు. అంతేకాదు, చైనీస్ షిప్స్ ద్వారా సరఫరా చేయవద్దని చమురు కంపెనీలు.. ఆయిల్ ట్రేడర్స్, సప్లయర్స్ను త్వరలో కోరనున్నారట. ఇంతకుముందు పవర్ మినిస్ట్రీ చైనీస్ ఉత్పత్తులను నిషేధించింది. రక్షణ శాఖ ఇటీవల 101 ఉత్పత్తుల దిగుమతులు క్రమంగా తగ్గించుకోవాలని నిర్ణయించింది.