వాడియా సంచలనం, రతన్ టాటాకు భారీ ఊరట: రూ.3వేల కోట్ల పరువు నష్టం దావా ఉపసంహరణ
ముంబై: బాంబే డైయింగ్ చైర్మన్ నస్లీ వాడియా సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్కు చెందిన రతన్ టాటా సహా ఇతరులపై ఇదివరకు రూ.3వేల కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ దావాను ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు పరువు నష్టం దావాలను అన్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా - టాటా యుద్ధానికి తెరపడినట్లేనని భావిస్తున్నారు.
టాటా సన్స్ - సైరస్ మిస్త్రీ ఇష్యూ
సమస్యను పరిష్కరించుకోండి..
పరిణితి చెందిన వ్యక్తులుగా ఇద్దరు కూడా కేసులను పరిష్కరించుకోవాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సూచించారు. దీంతో సోమవారం ఈ పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉన్న వాడియాను పరువు తీసే ఉద్దేశ్యం తమకు లేదని టాటా ప్రకటన చేశారు. దీంతో పిటిషనర్ ప్రస్తుత పిటిషన్ను ఉపసంహరించుకోవాలని బెంచ్ సూచించింది. తాజాగా వాడియా పరువు నష్టం దావాలను ఉపసంహరించుకున్నారు.
ఏం జరిగిందంటే?
టాటా సన్స్ నుంచి ఆయన మిత్రుడు సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్లో అత్యంత సీనియర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయిన నస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో రూ.3వేల కోట్లు పరిహారం కోరుతూ 2016 డిసెంబర్లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇందులో బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్స్ స్పేత్, ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ అనంతరం బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ పేరును చేర్చారు.
కలిసి పరిష్కరించుకోండి..
2019 జూలై నెలలో బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టి వేయడంతో వివాదం సుప్రీం కోర్టుకు చేరుకుంది. వాడియా, టాటా ఇరువురు కలిసి మాట్లాడుకొని, సమస్యను పరిష్కరించుకోవాలని జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తన తొలగింపుపై సైరస్ మిస్త్రీ NCLATలో పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై టాటా సన్స్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. మిస్త్రీ నియామకంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.