కార్వీకి షాక్: ఎగవేతదారుగా ప్రకటన, 23 నుండి సభ్యత్వం రద్దు
ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(KSBL)కి షాక్ తగిలింది. ఈ కంపెనీని డిఫాల్టర్(ఎగవేతదారు)గా ప్రకటించింది ఎన్ఎస్ఈ. అంతేకాదు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఎన్ఎస్ఈ ఐఎల్ నిబంధనల్లోని 4వ చాప్టర్ రూల్ 1, 2 కింద సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, 12వ చాప్టర్లోని ప్రొవిజన్ 1(ఏ) కింద డిఫాల్టర్గా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ నుండి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించింది. నిబంధనలను పాటించనందుకు కార్వీపై ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది.
కార్వీకి సంబంధించిన మరిన్ని వార్తలు
ఆస్తులను ఎవరికీ చేరవేయవద్దు
కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంపై KSBLను నిషేధిస్తూ SEBI మంగళవారం తుది ఆదేశాలు జారీ చేసింది. KSBL, దాని డైరెక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటర్లను ఆదేశించింది. ఇన్వెస్టర్ల క్లెయిమ్స్ను పరిష్కరించే వరకు, ఎన్ఎస్ఈ ముందస్తు అనుమతి లేకుండా సంస్థ ఆస్తులను ఎవరికీ చేరవేయవద్దని స్పష్టం చేసింది.
కార్వీపై అభియోగాలు ఇవే
ఖాతాదారుల అనుమతిలేకుండా వారి షేర్లను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలను పొందినట్టు KSBL అభియోగాలను ఎదుర్కొంటోంది. ఆ నిధుల్ని కార్వీ గ్రూప్ కంపెనీల్లోకి తరలించినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC) తన విచారణ నివేదికలో వెల్లడించింది. నేరపూరిత ఉద్దేశంతో ఈ అక్రమాలకు పాల్పడేందుకు తొమ్మిది కంపెనీలను ఉపయోగించుకున్నట్లు తెలిపింది. కొత్త బ్రోకరేజీ క్లయింట్స్ను చేర్చుకోరాదంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గత ఏడాది నవంబర్ నెలలో కార్వీపై నిషేధం విధించింది. ఖాతాదారుల షేర్లను అక్రమంగా వాడుకుని రూ.2,000 కోట్లకు పైగా నిధుల్ని దుర్వినియోగం చేసినట్టు కార్వీపై ఆరోపణలు రావడంతో సెబీ చర్యలు తీసుకుంది.
రిజిస్ట్రీ సర్వీసుల నుండి..
1985లో రిజిస్ట్రీ సర్వీసుల సంస్థగా కార్వీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ తర్వాత కమోడిటీలు, బీమా, రియాల్టీ, ఆన్ లైన్ బ్రోకింగ్ తదితర విభాగాల్లోకి విస్తరించింది. ఈ క్రమంలో బ్రోకింగ్ సంస్థగా క్లయింట్స్ ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి, వారికి తెలియకుండా ఖాతాల నుండి రూ.2000 కోట్లకు పైగా విలువ చేసే సెక్యూరిటీలను తన డీమ్యాట్ ఖాతాల్లోకి అనధికారికంగా మళ్లించుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ షేర్లను తనఖా పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకుంది. వీటిని కార్వీ రియాల్టీ వంటి గ్రూప్ కంపెనీలకు మళ్లించింది. ఇది వెలుగు చూడటంతో 2019లో కార్వీ కొత్త క్లయింట్స్ను తీసుకోకుండా సెబి నిషేధం విధించింది.