ఆదాయపు పన్ను కట్టాల్సిందే: ఎన్నారైలకు షాకిచ్చిన మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా (NRI)లకు షాక్ తగిలింది. వారు ఉండే దేశంలో ఆదాయపు పన్ను కట్టని పక్షంలో ఇక నుంచి భారత్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే శనివారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 182 పాటు విదేశాల్లో ఉంటే ఎన్నారైగా పేర్కొనేవారు. ఇప్పుడు దీనిని 240 రోజులకు పెంచింది. ఓ ఏడాదిలో 120 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే అతను ఎన్నారై కిందకు రాడు.
ఆదాయపు పన్ను యాక్ట్లో మార్పులు చేశామని, 182 రోజుల పాటు బయటి దేశాల్లో ఉంటే నాన్ రెసిడెంట్గా ఇప్పటి వరకు గుర్తిస్తున్నారని, ఇప్పుడు దీనిని 240 రోజులకు పొడిగించినట్లు అజయ్ భూషణ్ పాండే చెప్పారు. ఓ ఇండియన్ సిటిజన్కు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా పౌరసత్వం లేకుంటే అతను ఇండియన్ రెసిడెంట్ అవుతాడని, అతను ఆదాయపు పన్ను చెల్లించాలని పేర్కొన్నారు.
విదేశాల్లో ఉండే ఇండియన్స్కు ఇది షాక్ అని, ఈ కొత్త నిబంధన వారికి ప్రతికూలత అని ధ్రువ అడ్వైజర్స్కు చెందిన దినేష్ కనబర్ అన్నారు. ఇక వారు పన్ను ఆదా చేయలేరన్నారు. దుబాయ్ సహా ఎన్నో దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారని, అక్కడ వారు అతి తక్కువ ఆదాయపు పన్ను లేదా ఏమీ కట్టడం లేదని గుర్తు చేశారు. విదేశాల్లో పన్ను కట్టని వారు ఇక ఇక్కడ కట్టాల్సి ఉంటుందన్నారు.