కరోనాతో ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే: దువ్వూరి సుబ్బారావు
కరోనా మహమ్మారి-లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రస్తుతం ఉత్పత్తి లేదు. డిమాండ్ తగ్గింది. క్రమంగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలు తెరుచుకుంటున్నాయి. అయితే చాలా ఉద్యోగాలు పోవడం, వేతనాల్లో కోత వంటి కారణాల వల్ల మరికొన్ని రోజులు డిమాండ్ సన్నగిల్లుతుందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు సప్లై చైన్ తెగిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ డిమాండ్-సరఫరాను బ్యాలెన్స్ చేయడం అన్నారు.
ఇది అతిపెద్ద సవాల్..
కంపెనీలు, వ్యాపారులకు కార్మికులు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఉత్పత్తి పెరుగుతుంది. మరోవైపు ఉత్పత్తి పెరిగినా సరఫరా చైన్ ఉండాలి. దానికి తగిన డిమాండ్ ఉండాలని అభిప్రాయపడ్డారు దువ్వూరి. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ సరఫరా-డిమాండ్ అంటున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన 'ది ఛాలెంజ్ ఆఫ్ కరోనా క్రైసిస్-ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూ'లో వెబినార్ ద్వారా ఆయన మాట్లాడారు. ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లలో సప్లై చేయడం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
మేకిన్ ఇండియాకు రూ.20 లక్షల కోట్లు భేష్
కరోనా సంక్షోభంతో బ్యాంకుల ఎన్పీఐలు లేదా నిరర్థక ఆస్తులు మరింత పెరిగే ప్రమాదం ఉందని దువ్వూరి ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఈ భారం తగ్గించుకోవాలంటే రుణాల పునర్వ్యవస్థీకరణే మార్గమన్నారు. బ్యాంకులు రుణాలను పునరుద్ధరించి భారం తగ్గించుకోవాలన్నారు. కరోనా సంక్షోభం ఓ చక్రవ్యూహమన్నారు. దీనిని ఎదుర్కోవడంతో పాటు ఎలా బయటపడాలో కూడా తెలిసి ఉండాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన పథకం భారత్లో తయారీకి పెద్ద ఊతంలా పని చేస్తుందన్నారు.
మార్కెట్ ప్రతి చర్యలపై స్పృహ
ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల కోసం మార్కెట్ ప్రతిచర్యలపై స్పృహ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని దువ్వూరి చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆర్బీఐ సీఆర్ఆర్ను (క్యాష్ రిజర్వ్ రేషియో) తగ్గించి ద్రవ్యతను ప్రేరేపించిందన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు మారటోరియం విధించడమే కాకుండా బాండ్స్ కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించేందుకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సరఫరా చైన్లను ప్లాన్ చేసుకోవాలన్నారు.