భారీగా పెరగనున్న నిరర్థక ఆస్తులు, రీస్ట్రక్చర్ చేయకుంటే వసూళ్లు కష్టమే
భారతీయ బ్యాంకింగ్ రంగం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, నిరర్థక ఆస్తులు పెరుగుతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. వచ్చే 12 నుండి 18 నెలల కాలంలో స్థూల రుణాల్లో 11 శాతం వరకు ఎన్పీఏలు మారవచ్చునని తెలిపింది. ఈ ఏడాదిలో మొత్తం రుణాలు, నిరర్థక రుణాలకు మధ్య నిష్పత్తి తగ్గుతూ వచ్చింది. అయితే భవిష్యత్తులో ఇదే తీరును కొనసాగించడంలో బ్యాంకులకు ఇబ్బందులు ఎదురు కావొచ్చు. కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం కారణంగా రెండో క్వార్టర్లో బ్యాంకులు అంచనాలకు మించి రాణించాయని తెలిపింది.
అందుకే ఎన్పీఏల పెరుగుదల
మారటోరియం ముగియడం, కరోనా కారణంగా ఇబ్బందుల నేపథ్యంలో నిరర్థక రుణాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎస్ అండ్ పీ తెలిపింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మందగమనం, రుణాల చెల్లింపులను ప్రభావితం చేస్తుందని తెలిపింది. భారతీయ ఆర్థిక సంస్థల్లో ఒత్తిడి బీటలు పేరుతో ఎస్ అండ్ పీ తాజా నివేదికను విడుదల చేసింది.
ఇందులో ఆరు నెలల మారటోరియం రుణగ్రహీతలకు అంత ఊరటను ఇవ్వలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రుణాల్లో నిరర్థక రుణాల వాటా 10 నుండి 11 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని, ఈ ఏడాది జూన్ చివరినాటికి 8 శాతంగా ఉంది.
రీస్ట్రక్చర్ చేయకుంటే...
ఆగస్ట్ 31, 2020తో మారటోరియం ముగియడంతో జూన్ 30, 2020న 8 శాతంగా ఉన్న ఎన్పీఎల్ నిష్పత్తి పెరుగుతుందని, మా ఎన్పీఏ అంచనాలు అంతక్రితం కంటే తక్కువగా ఉన్నప్పటికీ 2022-23లోగా బ్యాకింగ్ వ్యవస్థ బలోపేతం కాకపోవచ్చునని పేర్కొంది. 3 శాతం నుండి 8 శాతం రుణాలు పునర్నిర్మితం కావొచ్చునని తెలిపింది. ఈ రుణాలు పునర్వ్యవస్థీకరణకు వీలుగా ఉన్నాయని ఎస్ అండ్ పీ తెలిపింది. వీటిని రీస్ట్రక్చర్ చేయకుంటే వసూళ్లు కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.
బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకున్నాయి
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకోనున్నాయని, కరోనా కాలంలో అదనపు కేటాయింపుల ద్వారా నిల్వలను పెంచుకున్నాయని తెలిపింది. కరోనా వల్ల వచ్చిన నష్టాల నుండి తేరుకోవడానికి అదనపు కేటాయింపులు ఉపయోగపడవచ్చునని తెలిపింది. ఎన్బీఎఫ్సీల పని తీరు మెరుగవుతుందని, బ్యాంకుల తరహాలోనే వసూళ్లు పెరుగుతున్నాయని తెలిపింది. బలమైన ఎన్బీఎఫ్సీలకు వ్యవస్థలోని అదనపు ద్రవ్యలభ్యత ప్రయోజనాలను అందించవచ్చునని, బలహీన కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చునని పేర్కొంది. 2021లోను ఇబ్బందులు ఉండవచ్చునని తెలిపింది.