NPAలు తగ్గాయి, కానీ ప్రైవేటు బ్యాంకుల్లో పెరిగాయి: రుణమాఫీ వల్లే...
బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. గత ఏడేళ్లలో నిరర్థక ఆస్తులు (NPA) మొదటిసారి మెరుగుపడ్డాయి. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఆస్తుల నాణ్యత మెరుగైందని RBI పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 9.1 శాతంగా ఉన్న NPAలు/మొండిబకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ చివరి నాటికి కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి.
PSBలు ఎన్పీఏలు దిగి వచ్చాయి
2017-18లో 11.2 శాతంగా ఉన్న స్థూల ఎన్పీఏలు 2018-19 నాటికి 9.1 శాతానికి తగ్గాయి. భారీ మెరుగు కనబరిచాయి. ఈ ఆర్ధ సంవత్సరంలోను అదే స్థాయిలో ఉండటం గమనార్హం. 2017-18లో 6 శాతంగా ఉన్న నికర ఎన్పీఏలు 2018-19 నాటికి 3.7 శాతానికి తగ్గాయి. PSBల స్థూల-నికర ఎన్పీఏలు కూడా దిగి వస్తున్నాయి. 2017-18లో స్థూల ఎన్పీఏలు 14.6 శాతం కాగా, 2018.19 నాటికి 11.6 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 8 శాతం నుంచి 4.8 శాతానికి దిగి వచ్చాయి.
ప్రయివేటు రంగంలో పెరిగాయి
ప్రయివేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 4.7 శాతం నుంచి 5.3 శాతానికి పెరగడం గమనార్హం. నికర ఎన్పీఏలు 2.4 శాతం నుంచి 2 శాతానికి తగ్గాయి. ఇందులో ఐడీబీఐ బ్యాంకులో పేరుకుపోయిన ఎన్పీఏలే ఎక్కువ. 2018-19లో ఐడీబీఐ ఎన్పీఏలు 29.4 శాతం. దీనిని ఎల్ఐసీ స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ ప్రభుత్వరంగ బ్యాంకును ప్రయివేటు బ్యాంకుగా పరిగణిస్తున్నారు.
రంగాల వారీగా చూస్తే...
ఆయా రంగాల వారీగా చూస్తే వ్యవసాయానికి ఇచ్చిన రుణాల్లో స్థూల ఎన్పీఏల వాటా 2018-19తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్దభాగంలో పెరిగాయి. గత రెండేళ్లలో పంట రుణాల మాఫీ ప్రకటించిన రాష్ట్రాల్లోనే ఎన్పీఏలు గణనీయంగా పెరిగాయి. పారిశ్రామిక రంగానికి ఇచ్చిన వాటిలో 17.4 శాతం ఉన్నాయి. 2017-18 నాటికి నమోదైన మొండి బకాయిల్లో 91 శాతం రూ.5 కోట్లకు మించి తిసుకున్న రుణాలే ఉన్నాయి. అంటే ఎక్కువ మొత్తం పెద్దలు తీసుకున్న రుణాలే ఎగవేతకు గురయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ రూ.71,543 కోట్లు. అంతక్రితం ఏడాది ఇది రూ.41,167 కోట్లుగా ఉంది.