ముఖేష్ అంబానీయే కాదు.. కరోనాతో దెబ్బతిన్న జెఫ్ బెజోస్, ఎక్కువ నష్టపోయింది ఎవరు, ఎంత?
కరోనా వైరస్ దెబ్బతో క్రూడాయిల్ ధర తగ్గి ముఖేష్ అంబానీ ఆస్తులు సోమవారం ఒక్కరోజే 580 కోట్ల డాలర్లు తగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆసియా నెంబర్ వన్ కుబేరుడి స్థానం నుండి రెండో స్థానానికి దిగజారారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకులు జాక్ మా మళ్లీ నెంబర్ వన్గా నిలిచారు.
మార్కెట్ దెబ్బ: 11 ఏళ్లలో తొలిసారి.. ముఖేష్ అంబానీ, రిలయన్స్కు భారీ దెబ్బ
ముఖేష్ అంబానీయే కాదు.. జెఫ్ బెజోస్ కూడా..
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురు రంగంలో కీలకంగా ఉండటంతో ఆయన పెద్ద మొత్తంలో నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా సోమవారం మరికొంతమంది కుబేరులు కూడా నష్టపోయారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, దాదాపు 7 బిలియన్ డాలర్లు కోల్పోయారు. అయితే ఆ తర్వాత 5.6 బిలియన్ డాలర్లతో కోలుకున్నారు.
బఫెట్, గేట్స్ సంపద ఎంత హరించుకుపోయిందంటే
బెర్క్షైర్ హాత్వేకు చెందిన వారెన్ బఫెట్ 5.3 బిలియన్ డాలర్లు కోల్పోయారు. బఫెట్ కేవలం నెల రోజుల్లోనే ఏకంగా 18 బిలియన్ డాలర్లు కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సంపద 5.1 బిలియన్ డాలర్లు కోల్పోయి 112 బిలియన్ డాలర్ల నుండి 106 బిలియన్ డాలర్లకు తగ్గింది.
239 బిలియన్ డాలర్లు హాంఫట్
సోమవారం ఒక్కరోజే ప్రపంచంలోని టాప్ 500 కుబేరులు 239 బిలియన్ డాలర్లు కోల్పోయారు. 2016 అక్టోబర్ తర్వాత అతిపెద్ద నష్టం ఇదే కావడం గమనార్హం. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు టాప్ 500 బిలియనీర్ల సంపద దాదాపు హాఫ్ ట్రిలియన్ డాలర్లు ఆవిరైంది.
అత్యంత నష్టపోయింది అర్నాల్డ్
కరోనా వైరస్ తెరపైకి వచ్చినప్పటి నుండి అందరికంటే ఎక్కువగా నష్టపోయిన కుబేరుల్లో అర్నాల్ట్ ముందున్నారు. కేవలం రెండు నెలల్లోనే ఇతని సంపద ఏకంగా 24 శాతం హరించుకుపోయింది. ఎందుకంటే ఇతని కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడ్డాయి.
ఎలాన్ మస్క్ కోల్పోయింది ఎంత అంటే
కరోనా వైరస్ దెబ్బతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఒక్కరోజే 6.75 బిలియన్ డాలర్లు కోల్పోయారు. మొత్తానికి సోమవారం ఒక్కరోజే బిలియనీర్లు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు.
ముఖేష్ను దాటేసిన జాక్ మా
మొన్నటి వరకు ఆసియా కుబేరుడిగా నిలిచిన ముఖేష్ సంపద సోమవారం ఒక్కరోజే 5.8 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానం నుండి ఆయన రెండో స్థానానికి పడిపోయారు. ఆ స్థానానికి అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా వచ్చి చేరారు.