ఎలన్ మస్క్ 'టెస్లా' కంపెనీకి భారత్ బిగ్ షాక్... ఇక ఆ ఎలక్ట్రిక్ కార్లు భారత్లో అడుగుపెట్టడం సాధ్యమేనా..?
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా కంపెనీకి భారత్ షాకిచ్చింది. భారత్కు దిగుమతయ్యే ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాన్ని తగ్గించేది లేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం పరిశీలనలో లేదని పార్లమెంటులో కేంద్ర విద్యుత్,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృషన్ పాల్ గుర్జార్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడున్న దిగుమతి సుంకాలు యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ నిర్ణయంతో భారత్లో టెస్లా కార్ల ఎంట్రీకి బిగ్ బ్రేక్ పడినట్లయింది. కొద్దిరోజుల క్రితమే టెస్లా అధినేత ఎలన్ మస్క్.. భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం మాత్రం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు.
టెస్లా ఎలక్ట్రిక్ కారు ధర భారత కరెన్సీలో దాదాపు రూ.1కోటి పైనే ఉంటుంది. వీటిని భారత మార్కెట్లోకి తీసుకురావాలంటే 60-100శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అసలే కారు ధర అంత భారీగా ఉండగా... సుంకంతో కలిపి దాని ధర మరింత భారీగా పెరగనుంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని భారత్లోకి తీసుకొచ్చినా ఎక్కువమందికి చేరువ కాలేమని టెస్లా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే భారత్లోకి ఎంట్రీ ఇస్తామని ఇటీవల ఎలన్ మస్క్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
నిజానికి అన్నీ కుదిరితే 2021 ఆరంభంలోనే భారత మార్కెట్లోకి టెస్లా వాహనాలను తీసుకురావాలని భావించారు. భారత్లోకి ఒకసారి అడుగుపెట్టాక స్థానికంగా తయారీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే సమీప భవిష్యత్తులో టెస్లా భారత్లో అడుగుపెట్టడం అనుమానమనే చెప్పాలి.
విదేశీ కార్ల తయారీ కంపెనీలు భారత్లో తమ తయారీ ప్లాంట్లను నెలకొల్పితే ట్యాక్స్ తగ్గింపు అంశాన్ని పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేనట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి ఇచ్చిన తాజా వివరణలో దేశీయ పన్ను తగ్గింపు గురించి ప్రస్తావించారు తప్పితే దిగుమతి సుంకం తగ్గింపు గురించి పేర్కొనలేదు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దేశీయ సుంకాన్ని తక్కువగానే ఉంచుతున్నట్లు తెలిపారు. FAME II పథకం ద్వారా కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణను పెంపొందించే దిశగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.
భారత్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏడాదికి కేవలం 1శాతం మాత్రమే జరుగుతున్నాయి. అదే చైనాలో ఇది 5శాతంగా ఉంది. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశం,ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం కావడంతో భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఆ కంపెనీలు భావిస్తున్నాయి.అయితే ఇప్పుడున్న భారీ దిగుమతి సుంకాలు దీనికి అడ్డంకిగా మారాయి. తమ ఎలక్ట్రిక్ వాహనాలను లగ్జరీ కేటగిరీలో పరిగణించవద్దని... కాలుష్యాన్ని తగ్గించే వాహనాలుగా చూడాలని టెస్లా విజ్ఞప్తి చేసినప్పటికీ భారత్ పెద్దగా పట్టించుకోలేదు.