గుడ్ న్యూస్: వేతనాల పెంపు, బోనస్ల చెల్లింపు... ఆటోమొబైల్ కంపెనీల జోష్!
కరోనా వైరస్ దెబ్బకు దేశంలో మొదట దెబ్బతిన్నది ఆటోమొబైల్ పరిశ్రమ అని చెప్పాలి. సాధారణంగానే రెండేళ్లుగా ఈ పరిశ్రమలో విపరీతమైన మందగమనం కొనసాగుతోంది. దానికి తోడు కరోనా తోడవటంతో ఇక ఈ పరిశ్రమ కుదేలైపోయింది. అయితే, లాక్ డౌన్ ఎత్తివేసి సుమారు రెండు నెలలు గడుస్తున్న తరుణంలో మిగితా పరిశ్రమల కంటే ముందుగా కోలుకుంటున్నది కూడా ఇదే పరిశ్రమ అని చెప్పొచ్చు. ఊహించిన దాని కంటే అధిక వేగంతో ఈ పరిశ్రమ కోలుకుంటుండటంతో ఆటోమొబైల్ కంపెనీల్లో జోష్ మొదలైంది. దీంతో అవి తమ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ, ఇంక్రెమెంట్లు, బోనస్ లు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. కరోనా వైరస్ దాడి తర్వాత ఇండియా లో వేతనాల కోత, ఉద్యోగాల తీత మాత్రమే కనిపించింది. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్ని రంగాలకూ వర్తిస్తుంది. కానీ, ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ పుంజుకుని తమ ఉద్యోగులకు ఇంత తీపి కబురు అందించటంతో... మిగితా రంగాలకు కూడా భవిష్యత్ పై భరోసా కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రమంగా మళ్ళీ జాబ్ మార్కెట్ కోలుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
అతిపెద్ద సవాల్ దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, 55 ఏళ్లలో సింగపూర్ వరస్ట్!
మారుతి నుంచి టొయోట వరకు....
దేశంలోని దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు అన్నీ కూడా తమ ఉద్యోగుల వేతనాలను సవరిస్తుండటం విశేషం. టొయోట కిర్లోస్కర్ తమ యూనియనేతర ఉద్యోగుల వేతనాలను పెంచింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఫ్యాక్టరీ ఉద్యోగుల వేతనాలను పెంచి, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ లకు ఇంక్రెమెంట్లు నిర్ణయించే పనిలో నిమగ్నమైంది. ఇక దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి అయితే తన ఉద్యోగులకు బోనస్, ఇంక్రెమెంట్లను వచ్చే రెండు నెలల్లో అందించేందుకు సమాయత్తమవుతోంది. ఎంజి మోటార్ కూడా త్వరలోనే వేతనాల పెంపు ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. గత ఏడాది కాలంగా ఆటోమొబైల్ పరిశ్రమ లోని ఉద్యోగుల్లో ఒక ఆందోళన నెలకొంది. అమ్మకాలు క్షీణించి పోవటం, ఆ వెంటనే కరోనా రావటంతో ఉద్యోగ భద్రత ప్రమాదంలో ఉందని భావించారు. కానీ, తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ రంగం కోలుకుంటున్నట్లే కనిపిస్తోంది.
4-14% పెంపు...
దేశంలోని 14 ప్రధాన కార్లు, వాహనాలు తయారు చేసే ఆటోమొబైల్ కంపెనీల్లో 10 కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలు పెంపు, బోనస్, ఇంక్రెమెంట్ల చెల్లింపు నిర్ణయాలు తీసుకోవటం విశేషం. త్వరలోనే మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాటన పయనించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోండా, టొయోట, రెనాల్ట్ కంపెనీలు తమ ఉద్యోగులకు 4% నుంచి 14% వరకు వేతనాలు పెంచాయి. ఉద్యోగుల కేటగిరీ ని బట్టి వారికి జీతభత్యాల పెంపు వర్తిస్తుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా అయితే తమ కార్మికులకు ప్రమోషన్లు కూడా ప్రకటించగా... ఉద్యోగులకు బోనస్ లను కూడా చెల్లించటం విశేషం. ఈ విషయాన్నీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ - పీపుల్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ సపోర్ట్, స్టీఫెన్ సుధాకర్ వెల్లడించారు. మారుతి, ఫోర్డ్, స్కోడా, ఫోక్స్ వాగన్, ఎంజి మోటార్ గతంలో ఇంక్రెమెంట్ల ను వాయిదా వేయగా... త్వరలోనే దానిపై సానుకూల నిర్ణయం తీసుకోనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అయితే... తమ ఉద్యోగుల వేతనాలు తగ్గించేది లేదని, అలాగే పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేసింది.
85% నికి సేల్స్...
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో ప్రజలకు సరికొత్త లైఫ్ స్టైల్స్ అలవాటు అవుతున్నాయి. గత 2-3 ఏళ్లుగా మొత్తం షేరింగ్ ఎకానమీ ఆధిపత్యం చెలాయించగా... కరోనా వ్యాప్తితో సామాజిక దూరం పాటించాల్సి వస్తోంది. దీంతో ప్రజా రవాణా, షేరింగ్ ట్రాన్స్పోర్టేషన్ కు గిరాకీ తగ్గి, మళ్ళీ సొంత వాహనాల కొనుగోలు దిశగా వినియోగదారులు ముందుకు సాగుతున్నారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలకు కేవలం 2 నెలల్లోనే మళ్ళీ కోవిడ్ -19 కంటే ముందు ఉన్న అమ్మకాల్లో 85% నికి దగ్గరగా తాజా సేల్స్ వచ్చేశాయి. త్వరలోనే మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఊహించినదానికంటే ముందే రివైవల్ కనిపిస్తుండటంతో అవి తమ ఉద్యోగులకు వేతనాల పెంపు, బోనస్ లు, ఇంక్రెమెంట్ల చెల్లింపులు ప్రకటిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ పరిణామం మరిన్ని రంగాలకు భరోసానిస్తే మన ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందని చెప్పొచ్చు.