ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు నగదు ముద్రణ లేదు: నిర్మల
కరోనా మహమ్మారి, ఎకనమిక్ స్లోడౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఉద్దేశ్యం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోకసభకు తెలిపారు. కరోనా మహమ్మారి కేసులు తగ్గడంతో లాక్ డౌన్ ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోందని, 2021 రెండో అర్ధ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడేందుకు కరెన్సీని ముద్రించడానికి ఏదైనా ప్రణాళిక ఉందా అనే ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మల సమాధానంచెబుతూ లేదు అన్నారు. కరోనా వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల వల్ల నగదును ముద్రించాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇది డైరెక్ట్ ఇన్కం సపోర్ట్ లేదా ఎంప్లాయిమెంట్ సపోర్ట్ ద్వారా ఉండాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ స్పందించారు.
కాగా, జాతి నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా తమ వంతు వాటా మేర పన్నులను చెల్లిస్తోన్న నిజాయితీపరులకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని నిర్మలమ్మ అంతకుముందు అన్నారు. కరోనా కారణంగా ఎన్నో సవాళ్లు, ఆటంకాలతో కూడిన పరిస్థితుల్లోను నిబంధనలను పాటిస్తున్నందుకు పన్ను చెల్లింపుదారులను ప్రశంసించారు. ఎన్నో సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోన్న ఆదాయపన్ను శాఖను ఆమె అభినందించారు. ఆదాయపన్ను శాఖ 161వ వార్షికోత్సవం సందర్భంగా అంతకుముందు సందేశం ఇచ్చారు.