ఇక వర్క్ ఫ్రమ్ హోమ్కు చెల్లు, కానీ ఐటీ కంపెనీల హైబ్రిడ్ విధానం
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది. గతంలో కరోనా తగ్గినట్లుగా అనిపించిన పలు సందర్భాల్లో ఐటీ సహా వివిధ రంగాల్లోని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు ఫుల్స్టాప్ పెట్టి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్లాన్ చేశాయి. ఒమిక్రాన్కు ముందు కూడా జనవరి నుండి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే ప్లాన్ చేశాయి ఐటీ సంస్థలు. కానీ ఒమిక్రాన్ వెలుగుచూడటంతో మళ్లీ వర్క్ ఫ్రమ్ హొమ్ మరింత కాలం కొనసాగింది. ఇప్పుడు కరోనా ప్రభావం దాదాపు తగ్గుముఖం పుట్టింది. దీంతో తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందులో ఐటీ కంపెనీలు ముందున్నాయి.
కరోనా కేసులు తగ్గడంతో
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్కు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. అలాగే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, పాజిటివ్ రేటు భారీగా తగ్గిందని, దీంతో అన్ని స్థాయిల్లో ఫుల్ ఆఫీస్ అటెండెన్స్ ఉండాలని, ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం కూడా తెలిపింది. అయితే కొన్ని ప్రయివేటు సంస్థలు కార్యాలయానికి రప్పించేందుకు సిద్ధం కాగా, మరికొన్ని సంస్థలు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నాయని తెలుస్తోంది.
హైబ్రిడ్ విధానం
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రిమోట్ వర్కింగ్ పాలసీకి మొగ్గు చూపింది. ఉద్యోగి వర్క్ ఫ్రమ్ బేస్ లొకేషన్ సౌకర్యం ఉంటుంది. రిమోట్ వర్క్ కొనసాగుతుందని భావిస్తున్నప్పటికీ, ఉద్యోగులు తమ డిప్యూట్ లొకేషన్ నుండి పని చేయాలని సిబ్బందికి పంపిన ఈ-మెయిల్ లేఖలో పేర్కొంది.
- వ్యాక్సినేషన్ పూర్తయిన మేనేజర్స్, సీనియర్ ఉద్యోగులు మార్చి మొదటి వారం నుండి కార్యాలయాలకు రావాలని విప్రో సూచించిందని తెలుస్తోంది. అయితే హైబ్రిడ్ వర్కింగ్ మోడ్కు సిద్ధమైంది. అంటే వారానికి రెండు రోజులు (సోమవారం, గురువారం) కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.
- ఇన్ఫోసిస్ హైబ్రిడ్ మోడల్ వర్క్కు సిద్ధమైంది. 40 శాతం నుండి 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పని చేస్తారని తెలుస్తోంది.
- కాగ్నిజెంట్ ఉద్యోగులు ఏప్రిల్ నుండి కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.
- హెచ్సీఎల్ టెక్నాలజీస్ కూడా అన్ని ఐటీ సంస్థల్లాగే ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తోంది. హైబ్రిడ్ మోడల్ను కొనసాగిస్తామని చెబుతోంది.
మానసిక ఒత్తిడి
హైబ్రిడ్ విధానంతో ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందట. ఉద్యోగాలు వదులుకున్న వారిలో 25 శాతం మంది ఇదే కారణం చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఒత్తిడి పెరిగిందని 79 శాతం మంది ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఐటీ సంస్థలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నాయి. కరోనా సోకితే మూడు వారాల సెలవు ఇస్తున్నాయి.
రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరగడంతో 2025 నాటికి ఈ టెక్నాలజీ దాదాపు 2 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశముంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వచ్చే ఏడాదికి 57 శాతం పెరగవచ్చు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో క్లౌడ్ వినియోగం 1.4 రెట్లు పెరిగింది.