రూపే, యూపీఐ చెల్లింపులు ఇక తప్పనిసరి, లేదంటే రోజుకు రూ.5వేల ఫైన్
ఢిల్లీ: రూపే కార్డు, యూపీఐ యాప్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్పై MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.50 కోట్లు ఆపై వార్షిక టర్నోవర్ ఉన్న అన్ని కంపెనీలు కస్టమర్లకు రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ ద్వారా చెల్లింపు విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
BHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండి
రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ ద్వారా చెల్లింపు విధానాన్ని ఫిబ్రవరి 1, 2020 వరకు ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని లేదంటే ఆయా కంపెనీలకు రోజుకు రూ.5వేల జరిమానా విధిస్తామని తెలిపింది. రూపే కార్డు, యూపీఐ యాప్స్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్లపై MDR ఎత్తివేయనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే.
జనవరి 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. డిజిటల్ మార్గంలో కస్టమర్ల నుంచి చెల్లింపులను స్వీకరించినందుకు బ్యాంకుకు వ్యాపారి చెల్లించే రుసుమునే MDRగా వ్యవహరిస్తారు. తాజా నిర్ణయంతో కస్టమర్లు, వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇదిలా ఉండగా, కేంద్రం నిర్ణయంపై మార్కెట్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.