కార్పోరేట్ సంస్ధలపై కనికరం- చర్చలే మార్గం- మరోసారి ఉత్తర్వులు పొడిగించిన సుప్రీం
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న కార్పోరేట్ సంస్ధలపై సుప్రీంకోర్టు మరోసారి కనికరం చూపింది. పూర్తి జీతాలు ఇవ్వకపోయినా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను మరోసారి పొడిగిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని ఉద్యోగులతో పాటు సంస్ధల యాజమాన్యాలకు సూచించింది.
కంపెనీ డైరెక్టర్ల వేతనాలపై వస్తు, సేవల పన్ను చెల్లించక్కర్లేదు, అలా చేస్తే మాత్రం పన్ను
జూలై వరకూ పొడిగింపు
లాక్ డౌన్ సమయంలో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ కార్పోరేట్ సంస్ధలు తీసుకుంటున్న నిర్ణయాలపై గతంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... అలాంటి సంస్ధలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగులపై మానవత్వం ప్రదర్శించాలని, వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై ఈ పిటిషన్ దాఖలైంది. దీంతో ప్రభుత్వాలు కార్పోరేట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు మే 25న ఆదేశాలు ఇచ్చింది. గతంలో వీటిని ఓ సారి పొడిగించగా.. తాజాగా మరోసారి జూలై నెలాఖరు వరకూ పొడిగిస్తూ సుప్రింకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మీరే మాట్లాడుకోండి
కార్పోరేట్, ప్రైవేట్ సంస్ధల యాజమాన్యాలు, వారి ఉద్యోగులు చర్చించుకుని ఈ వ్యవహారంలో ఓ పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. వేతనాలతో సంబంధం లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉండే ఉద్యోగులను పనిలోకి అనుమతించాలని ధర్మాసనం సూచించింది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి చర్చలను ప్రోత్సహించాలని, అంతిమంగా వాటి ఫలితాలను లేబర్ కమిషనర్ కు నివేదించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో తెలిపింది.
కేంద్రం ఉత్తర్వుల చట్టబద్ధత...
లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వని సంస్ధలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి 29న జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో సూచించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కూడా జూలై చివరి వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. అయితే విచారణ సందర్భంగా స్పందించిన కేంద్రం తరఫు న్యాయవాది మార్చి 29న ఇచ్చిన ఉత్తర్వులు కేవలం లాక్ డౌన్ కాలానికే పరిమితమని, ఈ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేక పోతే దానికి గల కారణాలు తెలుసుకునేందుకు సంస్ధల ఖాతాల ఆడిట్ చేస్తామని తెలిపింది.