FTX: FTX క్రిప్టో ప్లాట్ ఫారంలో మోసాన్ని అంగీకరించిన నిషాద్ సింగ్.. అసలేం జరిగిందంటే..
FTX: పెట్టుబడి సాధనాల్లో ఈమధ్య మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్రిప్టో కరెన్సీ. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలు సైతం నిన్న, మొన్నటి వరకు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇతర పెట్టుబడులతో పోలిస్తే అవి ఇస్తున్న రిటర్న్స్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. కానీ FTX కుంభకోణంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య క్రమేపీ పడిపోయింది. అయితే అందుకు కారణమైన నిందితుల్లో భారతీయ మూలాలున్న వ్యక్తీ ఉండటం తెలిసిందే.
మోసం నిజమే..
క్రిప్టో ఆస్తుల ట్రేడింగ్ ద్వారా కమొడిటీస్ లో మోసాలకు పాల్పడినట్లు నిషాద్ సింగ్ అంగీకరించారు. భారతీయమూలాలున్న 27 ఏళ్ల ఈ యువ ఇంజనీర్ FTX ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ కు సహ లీడ్ ఇంజనీర్ గా గతంలో పనిచేశారు. శామ్యూల్ బ్యాంక్ మన్ ఫ్రైజ్, గ్యారీ వాంగ్ తో కలిసి దీనిని ప్రారంభించారు. అయితే ఈ సంస్థ ద్వారా ఈక్విటీ పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాగా ఇప్పుడు అవి నిజమేనని ఒప్పుకున్నారు.
రంగంలోకి ప్రభుత్వ ఏజెన్సీలు:
ఈ మోసానికి సంబంధించి బ్యాంక్ మన్ ఫ్రైడ్ ఓ పథకాన్ని రూపొందించినట్లు గతేడా డిసెంబరులో ఫెడరల్ అధికారులు అభియోగం మోపారు. మంగళవారం జరిగిన విచారణలో నిషాద్ నిజం అంగీకరించడంతో.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(SEC) ఆయనపై కేసు నమోదు చేసింది. న్యూయార్క్ లోని US అటార్నీ కార్యాలయం, కమొడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్(CFTC) సైతం సింగ్ పై తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించాయి.
ఆ ఫండ్ ఫ్రైడ్, వాంగ్ లదే..
FTX కస్టమర్ల నిధులను అలమేడా రీసెర్చ్ అనే క్రిప్టో హెడ్జ్ ఫండుకు తరలించినట్లు SEC ఆరోపించింది. ఇందుకోసం సింగ్ కోడ్ రూపొందించినట్లు పేర్కొంది. అయితే ఈ ఫండ్.. బ్యాంక్ మన్ ఫ్రైడ్, గ్యారీ వాంగ్ లకు సంబంధించినదేనని వెల్లడించింది. వినియోగదారుల నిధులు సురక్షితంగా ఉంటాయని అబద్ధపు హామీలు ఇచ్చి, ఇష్టానుసారం నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఇతర కంపెనీల్లోకి ట్రాన్స్ ఫర్ చేశారని పేర్కొంది. ఈ తరహా చర్యల్లో నిషాద్ పాత్ర సైతం కీలకమని చెప్పింది.
విలాసవంతమైన ఇల్లు, విరాళాలు:
FTX పతనం అంచున ఉన్న సమయంలో నిషాద్ పలు మోసాల్లో భాగమైనట్లు CFTC ఆరోపించింది. వినియోగదారులకు చెందిన సుమారు 6 మిలియన్ డాలర్లను వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకున్నట్లు తెలిపింది. ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు పలు స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళాలు సైతం ఇచ్చినట్లు గుర్తించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఈ తరహా మోసాల కట్టడికి క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ లు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించింది.